హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతున్నదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ర్టాలతోనే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకూ తెలంగాణ సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. యూరప్ దేశాల పెట్టుబడులకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నదని, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చేవారికి రాష్ట్రంలో భూములు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బుధవారం ఆయన యూరోపియన్ బిజినెస్ గ్రూప్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్తోపాటు యూరప్లోని పలు కంపెనీల ప్రతినిధులు, వ్యాపార వర్గాలు, రాయబార కార్యాలయాల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని వ్యాపార అనుకూలతలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, టీఎస్ ఐపాస్ విశేషాల గురించి వివరించారు. యూరప్ వ్యాపార, వాణిజ్య వర్గాలను చేరుకొని తెలంగాణ గురించి వివరించేందుకు సహకరించాలని వివిధ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలను తీసుకురావడంతోపాటు వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు వివిధ వర్గాల నుంచి వస్తున్నాయని తెలియజేశారు. పెట్టుబడులకు రాష్ర్టాన్ని ఆకర్షణనీయ గమ్యస్థానంగా మార్చడంలో టీఎస్ ఐపాస్ విజవంతమైందని పేర్కొంటూ.. ఆ విజయాలకు సంబంధించిన గణాంకాలను ప్రస్తావించారు.
జీడీపీలో భారీ వాటా తెలంగాణదే
గత 7 సంవత్సరాల్లో తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సింహభాగం తెలంగాణదేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై అనేక దేశాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్, ఫుడ్ప్రాసెసింగ్ లాంటి 14 రంగాలకు తెలంగాణ అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. ఈ రంగాల్లో దేశంలోని ఇతర రాష్ర్టాలతోనే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడేందుకు తెలంగాణలో భారీ పారిశ్రామిక పారులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్, మెడికల్ డివైస్ పార్ తదితర పారిశ్రామిక పార్కుల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
పరిశ్రమలకు ల్యాండ్ బ్యాంక్ సిద్ధం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ఏ సంస్థకైనా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైనంత ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు ల్యాండ్ బ్యాంక్ సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేవలం మౌలిక వసతుల కల్పనకే కాకుండా మానవవనరుల అభివృద్ధి, శిక్షణకూ తెలంగాణ అధిక ప్రాధాన్యమిస్తున్నదని, అందులో భాగంగానే కంపెనీల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నదని వివరించారు. అమెరికా, జపాన్, చైనా, కొరియా, తైవాన్ తదితర దేశాల కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని, పలు యూరోపియన్ కంపెనీలు కూడా ఇక్కడ అత్యంత సౌకర్యవంతంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకొంటున్నాయని తెలిపారు. తెలంగాణలోని వ్యాపార అనుకూలతలు, ప్రభుత్వ పాలసీలతోపాటు ఇక్కడ పెట్టుబడులకు గల అవకాశాలను యూరోపియన్ సంస్థలకు తెలియజేసేందుకు ప్రయత్నించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా, పెట్టుబడులకు, వ్యాపార నిర్వహణకు తెలంగాణలో ఎంతో అనువైన వాతావరణం ఉన్నదని తమకు తెలుసని, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, పారిశ్రామిక అనుమతుల ప్రక్రియ గురించి తమకు సానుకూలమైన ఫీడ్బ్యాక్ ఉన్నదని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు.