న్యూఢిల్లీ, జూలై 23: మొండి బకాయిలు తగ్గడంతో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ఏడాది ప్రాతిపదికన 26 శాతం అధికమై రూ.2,071 కోట్ల లాభాన్ని గడించింది. 2021-22 ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,641.92 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.8,062.81 కోట్ల నుంచి రూ.8,582.25 కోట్లకు చేరుకున్నది. వడ్డీ ఆదాయం రూ.6,479.78 కోట్ల నుంచి రూ.7,338.49 కోట్లకు చేరుకున్నది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.56 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 1.28 శాతం నుంచి 0.62 శాతానికి దిగొచ్చింది.