అబిడ్స్, జనవరి 6: సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో ధూల్పేట్ పరిసర ప్రాంతాలలో పతంగుల తయారీ ఊపందుకుంది. ధూల్పేట్ పరిసర ప్రాంతాలైన గంగాబౌలి, శివలాల్నగర్, లక్ష్మినగర్, మోహన్దాస్ మఠ్, ఇమ్లియాబాగ్, రహీంపురాలలో పతంగుల తయారీ జోరుగా సాగుతోంది. కేసీఆర్ చిత్రపటం, నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, స్వచ్ఛభారత్, బుల్లెట్ ట్రైన్, కార్టూన్లు, బాహుబలి తదితర చిత్ర పటాలతో పతంగులను తయారు చేసి విక్రయాలకు సిద్దంగా ఉంచుతున్నారు.
కేసీఆర్, మోడి పతంగుల ధరలు డజన్ 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా సాధారణ పతంగులు పది రూపాయల నుంచి మొదలుకుని 250 రూపాయల వరకు విక్రయాలు చేపడుతున్నారు. సాంప్రదాయ మాంజా నాణ్యతను బట్టి 60 రూపాయల నుంచి 500 రూపాయల వరకు చరఖా విక్రయిస్తున్నారు. చరఖాలు సైజు, డిజైన్ను బట్టి ఐదు రూపాయల నుంచి మొదలుకుని 500 రూపాయల వరకు విక్రయాలు చేస్తున్నారు.