నితిన్, కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 26న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబ అనుబంధాల కలబోతగా సాగే ప్రేమకథా చిత్రమిది. అర్జున్, అను అనే జంట ప్రణయం ఎలా పరిణయానికి దారితీసిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. వినోదం అలరిస్తుంది. గత నాలుగు రోజులుగా నాయకానాయికలపై ఓ గీతాన్ని చిత్రీకరించాం. ఈ పాటతో చిత్రీకరణ పూర్తయింది’ అని తెలిపారు. వి.కె.నరేష్, వినీత్, రోహిణి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్.