దుబ్బాక, మే 26: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి గురువు నక్కల పున్నారెడ్డి (90) మంగళవారం కన్నుమూశారు. ఆయన కొన్నేండ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వగ్రామైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో మంగళవారం ఉదయం పున్నారెడ్డి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబీకులు తెలిపారు.
దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో కేసీఆర్ విద్యనభ్యసించే సమయంలో పున్నారెడ్డి తెలుగు సబ్జెక్టు బోధించేవారు. పున్నారెడ్డి సతీమణి బాలమణి కూడా మూడునెలల కిందట చనిపోయారు. ప్రస్తుతం పున్నారెడ్డి కుమారుడు దామోదర్రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. పున్నారెడ్డి మృతికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలియజేశారు.