బాలీవుడ్ ప్రేమజంట కత్రినాకైఫ్-విక్కీకౌశల్ పరిణయఘట్టానికి తెరలేచింది. ఈ నెల 9న వారిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ వివాహానికి రాజస్థాన్లోని భర్వారా కోటలోని సిక్స్ సెన్సెస్ రిసార్ట్ వేదిక కానున్నది. సంప్రదాయ లాంతర్లు, ఖవ్వాలీ గాయకులతో కోటను అందంగా తీర్చిదిద్దారు. కత్రినాకైఫ్తో పాటు విక్కీకౌశల్ కుటుంబసభ్యులు సోమవారమే రాజస్థాన్ చేరుకున్నారు. మంగళవారం రాత్రి సంగీత్ వేడుకలతో ఈ వివాహఘట్టం మొదలుకానున్నది.
ఈ సంగీత్ వేడుకలో ‘సింగ్ ఈజ్ కింగ్’ సినిమాలోని ‘తేరీ ఓర్’ పాటకు విక్కీ-కత్రినా జంటగా నృత్యం చేయబోతున్నారు. విక్కీ కౌశల్ కోసం కత్రినాకైఫ్ కూడా ప్రత్యేకంగా కొన్ని పాటలకు డ్యాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం రెట్రో శైలిలో ప్రత్యేకంగా ఓ వేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. బుధవారం ఉదయం హల్దీ , మెహందీ వేడుకలను జరుపబోతున్నారు. మెహందీ వేడుక కోసం రాజస్థాన్లోని సోజాత్ నుంచి ఆర్గానిక్ మెహందీ పౌడర్ను ప్రత్యేకంగా సిద్ధంచేశారు. ఈ నెల తొమ్మిదవ తేదీన రెండు సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి వేడుక జరుగనున్నది. పెళ్లికి కేవలం 120 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. ఫరాఖాన్, అమిత్ ఠాకూర్, అంగద్బేడీ, శర్వారీ వాగ్, కబీర్ఖాన్లు ఆహ్వానం అందిన వారి జాబితాలో ఉన్నారు.
సల్మాన్ఖాన్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి హాజరుకానున్నట్లు వార్తలొస్తున్నాయి. పెళ్లి విషయంలో అత్యంత గోప్యతను పాటిస్తున్నారు విక్కీ-కత్రినా. వివాహ ఘట్టానికి సంబంధించిన ఫొటోలు బయటకురాకుండా, అతిథులెవరూ సోషల్మీడియాలో పోస్ట్ చేయకుండా కొన్ని నియమ నిబంధనలను అనుసరించబోతున్నట్లు సమాచారం. అతిథుల రాకతో జైపూర్ ఎయిర్పోర్ట్ బిజీగా మారింది. కబీర్ఖాన్, నేహాధూపియాతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు భర్వారా కోటకు చేరుకున్నారు.