లింగంపేట, జనవరి 18 : లింగంపేట మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది పలువురికి కొవిడ్ టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను డిప్యూటీ డీఎంహెచ్వో శోభారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ టీకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అర్హులైన వారందరూ టీకా వేయించుకోవాలని అన్నారు. మండలంలోని 41 పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల్లో మొదటి డోసు 91 శాతం, రెండో డోసు 85 శాతం పూర్తయినట్లు తెలిపారు. 15 నుంచి 18 ఏండ్ల లోపు వారికి 60 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బూస్టర్ డోసును సైతం వేస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట వైద్యసిబ్బంది కవిత, అనురాధ, భాగ్యలక్ష్మి, ప్రదీప్ తదితరులు ఉన్నారు. లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం 291 మందికి కొవిడ్ టీకాలు వేశామని పీహెచ్సీ వైద్యురాలు సమీనా తెలిపారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
అర్హులు బూస్టర్ డోస్ తీసుకోవాలి
ఎల్లారెడ్డి, జనవరి 18 : అర్హులైన ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వెంకటస్వామి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. థర్డ్ వేవ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ను కూడా తీసుకోవాలని సూచించారు.