వాషింగ్టన్, ఏప్రిల్ 1: అగ్రరాజ్యం అమెరికాను సంపూర్ణంగా పునర్నిర్మించే బృహత్తర ప్రాజెక్టుకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ శ్రీకారం చుట్టారు. బీటలువారుతున్న దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను (మౌలిక వసతులను) మళ్లీ సుధృడం చేసే మహత్తర కార్యక్రమాన్ని బుధవారం ఆవిష్కరించారు. పర్యావరణ విపరిణామాలను తట్టుకునేలా.. సైనికపరంగా, ఆర్థికపరంగా తనకు సవాల్ విసురుతున్న చైనాను తన దరిదాపుల్లోకి రాకుండా చేసేలా.. ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లతో (రూ.146 లక్షల కోట్లు) భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించారు. మౌలిక వసతుల అభివృద్ధికి వచ్చే ఎనిమిదేండ్లలో దీనిని వ్యయం చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని బైడెన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ధృడమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. అమెరికా భవిష్యత్తు కోసం 2 ట్రిలియన్ డాలర్లతో ఒకేసారి పెడుతున్న మూలధన పెట్టుబడి ఇది అని పేర్కొన్నారు. ఏటా తుపాన్లు, వరదలు, కార్చిచ్చుల వల్ల సంభవించే కోట్లాది డాలర్ల నష్టం నుంచి ఇది ప్రజలను రక్షిస్తుందని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఉద్యోగాల కల్పనపై అమెరికా పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదేనని తెలిపారు. కార్పొరేట్ పన్నును భారీగా పెంచడం ద్వారా పథకానికి నిధులు సమకూర్చనున్నారు.
అమెరికా వెన్నెముకను పునర్నిర్మించేందుకు తరానికి ఒకసారి మాత్రమే వెచ్చించే పెట్టుబడి ఇది. ఇది మౌలికంగా దేశ స్వరూపాన్నే మార్చనున్నది. దేశ ఆర్థికాభివృద్ధితోపాటు లక్షలాది ఉద్యోగాలు కొత్తగా రానున్నాయి.
-బైడెన్