సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ): రైల్వే, మెట్రో రైలు శాఖలలో ఉద్యోగాలు పెట్టిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన భార్యాభర్తలతో పాటు మరొకరిని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నేరేడ్మెట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన కాకరాపర్తి సురేంద్ర అలియాస్ పుట్టా సురేశ్ రెడ్డి, భార్య నాగలక్ష్మి, తల్లి భాగ్యలక్ష్మి, స్నేహితులు ఆలం, శ్రీనివాస్రావులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సురేంద్ర ఉప్పల్ ప్రాంతంలో ప్రైవేట్ కారు డ్రైవర్గా పనిచేస్తూ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ఖమ్మంకు చెందిన శ్రీనివాస్రావు, సికింద్రాబాద్కు చెందిన ఆలం పరిచయమయ్యారు. వారిద్దరూ తాము రైల్వే, మెట్రో రైలు విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా 5 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటే సిఫార్సు చేయమని అడిగారు. భారీ కమిషన్ వస్తుందని ఆశపుట్టించారు.
ఐడీ కార్డులు ఉండటంతో నమ్మారు..!
సురేంద్ర ఉప్పల్తో పాటు తనకు పరిచయం ఉన్న నిరుద్యోగులకు రైల్వేలో ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మించాడు. వారిని రైల్వే నిలయంలోకి తీసుకువెళ్లి సెక్షన్ కార్యాలయం వద్ద శ్రీనివాస్రావు, ఆలంలను రైల్వే అధికారులుగా పరిచయం చేశాడు. ఆ ఇద్దరి దగ్గర రైల్వే కార్డులు ఉండటంతో నిజంగానే రైల్వే ఉన్నతాధికారులని నమ్మిన బాధితులు డబ్బులు చెల్లించి విద్యార్హత సర్టిఫికెట్లను ఇచ్చేశారు.
పత్రాలన్నీ నకిలీవే.!
డబ్బులు చెల్లించిన తర్వాత ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు శ్రీనివాస్రావు, ఆలంలను నిలదీశారు. కొద్ది రోజుల పాటు వాయిదాలు పెడుతూ, ఫోన్ స్విచాప్ చేసుకున్నారు. ఒత్తిడి పెరగడంతో కొన్ని సృష్టించిన నకిలీ అపాయింట్మెంట్ పత్రాలను ఇచ్చారు. వాటిని తీసుకుని వెళ్లి రైల్వే నిలయంలో అధికారులకు చూపించగా అవన్నీ నకిలీవని తేలింది. వెంటనే బోడుప్పల్లోని సురేంద్ర నివాసానికి వెళ్లారు. అక్కడ అతను కనపించలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు మేడిపల్లి, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై రంగంలోకి దిగిన మల్కాజిగిరి ఎస్ఓటీ, మేడిపల్లి పోలీసులు మంగళవారం సురేంద్ర, భార్య నాగలక్ష్మి, సురేశ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ఖరీదైన వాహనాలతో పాటు నకిలీ ఆధార్, పాన్ కార్డులు, ఫేక్ అపాయింట్మెంట్ లేఖలను స్వాధీనం చేసుకున్నారు. సురేంద్ర తల్లి భాగ్యలక్ష్మి, శ్రీనివాస్రావు, ఆలంలు పరారీలో ఉన్నారు.
బంగారం ఆశచూపి రూ.12లక్షలు
చాలా తక్కువ ధరకే లండన్లో బంగారం వస్తుందని తన స్నేహితులను నమ్మించాడు. 2012 అక్కడి నుంచి తెప్పానని చెప్పి రూ.12 లక్షలు తీసుకున్నాడు. 2013లో సురేంద్ర హైదరాబాద్కు మకాం మార్చాడు. తర్వాత బంగారం ఇవ్వకపోవడంతో స్నేహితులు నిలదీశారు. 2018లో బంగారం మోసం పై మధిర పీఎస్లో కేసు నమోదైంది. ఆరేండ్ల పాటు సతాయించి ఇచ్చేశాడు.
పుట్టా సురేశ్రెడ్డిగా మార్పు.!
హైదరాబాద్ వచ్చిన సురేంద్ర తన పేరును పుట్టా సురేశ్రెడ్డిగా మార్చుకున్నాడు. అంతేకాకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డులను తీసుకుని వాటితో బ్యాంక్ ఖాతాలను తెరిచాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపు రూ.2 కోట్లు వసూలు చేసిన సురేంద్ర బోడుప్పల్లో రూ.45 లక్షలతో ఫ్లాట్, ట్రావెల్స్ కోసం నాలుగు ఖరీదైన కార్లు కొన్నాడు. జడ్చర్లలో రూ.25 లక్షలతో ఓ క్యాంటీన్ను నడిపిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా మరోసారి సురేంద్రను కస్టడీలోకి తీసుకుని ఆస్తులను జప్తు చేస్తామని సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో క్రైమ్ డీసీపీ యాదగిరి, ఎస్ఓటీ, మేడిపల్లి ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.