వెల్దుర్తి, నవంబర్ 18: తమ భూములు కబ్జా అయినట్టు రైతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధీనంలోని భూములను సర్వే చేస్తున్నామని మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. జమున హ్యాచరీస్ భూకబ్జాపై జరుగుతున్న సర్వేను గురువారం కలెక్టర్ పరిశీలించారు. సర్వే వివరాల ను డీఐ లక్ష్మీసుజాత, తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రకాశ్ను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి వద్ద ఉన్న సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఏప్రిల్లో అచ్చంపేట, హక్కీంపేట గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, జమున హ్యాచరీస్ యాజమా న్యం తమ భూముల్లోకి రానివ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారన్నారు. గత మే నెలలో మొదటి సర్వే నిర్వహించి ప్రాథమిక నివేదిక తయారు చేసినట్టు చెప్పారు.
ఈ నివేదికకు వ్యతిరేకంగా జమున హ్యాచరీస్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించగా, పూర్తిస్థాయి సర్వే చేస్తే అన్ని నిజాలు తెలుస్తాయని హైకోర్టు సూచించిందని తెలిపారు. హైకోర్టు సూచనల మేరకు తాసిల్దార్, డీఐలు సర్వే చేపట్టగా, ఈ సర్వేకు వ్యతిరేకంగా మరోమారు జమున హ్యాచరీస్ పరిశ్రమ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారన్నారు. తప్పనిసరిగా సర్వే జరగాలని, కరోనా నిబంధనల మేరకు చేపట్టాలని హైకోర్టు సూచించిందని కలెక్టర్ తెలిపారు. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు సమగ్ర సర్వే చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా సర్వే చేశామని, నిజాలు బయటకు వస్తాయని, అందరికీ న్యాయం జరుగుతుందని కలెక్టర్ హరీశ్ వెల్లడించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు 16, 17, 18వ తేదీల్లో సర్వే నిర్వహించారు. అయి తే సర్వే పూర్తికాకపోవడంతో మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 7, 78, 79, 80, 81, 82వ సర్వే నం బర్లలో మరో రెండు రోజుల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. సర్వేకు సంబంధిత రైతులతోపాటు జమున హ్యాచరీస్ పరిశ్రమ ప్రతినిధులు సహకరించాలని నోటీసులు జారీ చేశారు.