కొండాపూర్, డిసెంబర్ 6: మఖ్తల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హైటెక్ సిటీలోని ఐటీ కారిడార్లో సోమవారం సందడి చేశారు. జై మఖ్తల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరానికి విచ్చేసిన విద్యార్థులు టీ – హబ్తో పాటు సైబర్ టవర్స్ను సందర్శించినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ మఖ్తల తెలిపారు. అనంతరం, ఫినిక్స్ ఏరీనాలో విద్యార్థులు పేరిణి, భరతనాట్యం, కథాకళి, ఒడిస్సీ, మణిపురి, మోహినీ అట్టం, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. మఖ్తల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలపై ఉన్న ఆసక్తిని గమనించి వారికి నృత్య ప్రదర్శనల్లో ఉచితంగా శిక్షణను అందించినట్లు సందీప్ కుమార్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ విద్యార్థులను అభినందించారు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి విజయమైనా సొంతమవుతుందన్నారు. కార్యక్రమంలో టీటా ఉపాధ్యక్షుడు రాణా ప్రతాప్ బొజ్జం, సభ్యులు ఎండీ ఇలియాస్, శ్రావణి బస్వరాజ్, బస్వరాజ్ వాకిటి, నారాయణపేట్ జిల్లా జీసీడీఓ పద్మ నళిని, ముడుమాల్ హెచ్ఎంఎస్ అఫ్రీన్ బేగం, ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, ప్రకాశ్, రేణుక, స్వప్న పాల్గొన్నారు.