భద్రాచలం, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి, జూన్ ఒకటో తేదీ వరకు భవిత శిక్షణ కేంద్రాలకు పంపించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని ఎంపీడీవోలతో మండలాల వారీగా శుక్రవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు సెక్టార్ సిల్ కౌన్సిలింగ్ ద్వారా ఆరు సెక్టార్లలో 2,500 మందికి 25 రకాల కోర్సులలో 90 రోజులపాటు శిక్షణ అందించి, వారు నేర్చుకున్న కోర్సునుబట్టి ప్రభుత్వ ప్రైవేట్రంగ సంస్థలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా ముద్ర లోన్స్ ఇప్పించి వారికి జీవనోపాధి కల్పించనున్నట్లు చెప్పారు.
ఈ శిక్షణ భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వరావుపేట మండలాల్లో అందిస్తున్నామని, ఎంబ్రాయిడింగ్, కుట్లు, అల్లికలు, బ్యూటీషియన్ వంటి కోర్సులు మహిళలు ఉన్నచోటే నేర్చుకునే విధంగా అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఐటీడీఏ కార్యాలయంలోని జేడీఎంను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.