‘క్రీడానేపథ్య కథాంశంతో సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. సినిమా తాలూకు భారం మొత్తం హీరోనే మోయాల్సివుంటుంది. నాగశౌర్య అంకితభావంతో ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు’ అని అన్నారు శర్వానంద్. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘లక్ష్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగశౌర్య, కేతికశర్మ జంటగా నటిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్మరార్ నిర్మించారు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ‘నాగశౌర్య స్ఫూర్తితో భవిష్యత్తులో నేను సిక్స్ప్యాక్ చేస్తా. ఆర్చర్ పాత్రలో పరిపూర్ణత కోసం నాగశౌర్య పడిన కష్టం ప్రచార చిత్రాల్లో కనిపిస్తుంది’ అని అన్నారు. అరుదైన ఆర్చరీ క్రీడా నేపథ్యంలో సినిమా చేయాలనే ఆలోచనతోనే చిత్రబృందం సగం విజయాన్ని అందుకున్నారని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ‘లక్ష్యసాధనలో ఓ ఆర్చరీ ప్లేయర్ సాగించిన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. సినీ పరిశ్రమలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో శర్వానంద్ ఒకరు. జయాపజయాల్ని సమంగా స్వీకరించే నేర్పు, నిజాయితీగా ఉండటం శర్వానంద్ నుంచే నేర్చుకున్నా’ అని నాగశౌర్య పేర్కొన్నారు. ఇండియాలో తొలి ఆర్చరీ నేపథ్య చిత్రమిదని, నాగశౌర్య నాలుగు భిన్న లుక్స్లో కనిపిస్తాడని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్, సంతోష్జాగర్లపూడి తదితరులు పాల్గొన్నారు.