హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్సరం ప్రారంభంపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకొన్నది. జూన్ 15 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం, జూలై 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించాలని నిర్ణయించింది. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ సోమవారం విడుదల చేశారు. 221 రోజులపాటు తరగతులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈసారి టెన్త్ ఫలితాలు ఆలస్యంగా విడుదలకానుండటంతో ఇంటర్ ఫస్టియర్ తరగతులను జూలై 1 నుంచి ప్రారంభించనున్నారు. 2022-23లో మార్చి 31న చివరి పనిదినంగా నిర్ణయించారు. బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లను చేపట్టాలని సూచించింది.
ముల్యాంకన పారితోషికం 25% పెంపు
ఇంటర్ పరీక్షలు, మూల్యాంకన విధుల్లో పాల్గొంటున్న అధికారులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది పారితోషకాన్ని 25% మేర పెంచారు. ఈ మేరకు బోర్డు సోమవారం నిర్ణయం తీసుకొన్నది. పేపర్ను బట్టి కొన్నింటికి రూ.18.93 నుంచి రూ.23.66కు, మరికొన్నింటికి రూ.641 నుంచి రూ.800కు పారితోషికాన్ని పెంచారు. దీనిపై కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేశ్, పలు సంఘాల నేతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
పరీక్షలకు 95% విద్యార్థులు హాజరు
సోమవారం నిర్వహించిన ఇంటర్ ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1 పరీక్షలకు 4,48,083 మంది (95%) విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,71,865 మంది విద్యార్థుల్లో 23,782 మంది పరీక్షలకు హాజరు కాలేదు. ఈ పరీక్షల సందర్భంగా జగిత్యాల, జనగామ, హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మొత్తం ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు.