ఏడాది వయసులో పోలియో బారినపడ్డారు. ప్రతి వేసవిలో ఒక ఆపరేషన్. పదహారేండ్లు వచ్చేసరికి మొత్తం ఎనిమిది శస్త్ర చికిత్సలు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. నటిగా, గాయనిగా, సామాజిక సేవకురాలిగా.. తన ప్రతిభను చాటుతూనే ఉన్నారు. అందుకు గుర్తింపుగా ‘సర్వశ్రేష్ఠ దివ్యాంగ్ జన్’ అవార్డు అందుకోనున్నారు పద్మప్రియ.
ఖమ్మం పట్టణంలోని ఓ నిరుపేద కుటుంబం. సత్యం ప్రైవేట్ ఉద్యోగి, కుసుమ గృహిణి. ఆ దంపతుల కూతురు పద్మప్రియ. ఏడాది నిండకుండానే పోలియో బారిన పడిందా చిన్నారి. ఆరేండ్ల వయసులో సెయింట్ మేరీ పోలియో రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. అక్కడ ఫిజియో థెరపిస్ట్గా పనిచేస్తున్న క్లారా హిటన్ పద్మప్రియను దత్తత తీసుకున్నారు. ప్రతి వేసవిలో ఒక ఆపరేషన్ చొప్పున పదహారేండ్లు వచ్చే సరికి ఎనిమిది సర్జరీలు చేయించారు. చంక కర్రల సాయంతో నడవగలిగే స్థాయికి వచ్చింది పద్మ. నిజానికి, తనెప్పుడూ వైకల్యాన్ని తలుచుకుని కుంగిపోలేదు. నిత్యం, కొత్త విషయాలపై ఆసక్తి చూపేది. క్లారా వద్ద సంగీతంలో మెలకువలు నేర్చుకుంది. నాటకాలు, సిట్స్ వేస్తూ నటనలో ప్రావీణ్యం సంపాదించింది. పట్టుబట్టి డిగ్రీ పూర్తి చేసింది. కంప్యూటర్స్లో పీజీ డిప్లొమా అందుకుంది. అక్కడితో ఆగలేదామె. యాభై రెండేండ్ల వయసులోనూ.. శరీరం సహకరించకపోయినా, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నా దివ్యాంగుల అభ్యున్నతికి పాటుపడుతున్నది.
నటనలో మేటి..
పద్మప్రియకు సంగీతమంటే ప్రాణం. సరిగమలతో భవిష్యత్కు బాటలు వేసుకోవాలనే సంకల్పంతో హైదరాబాద్ వచ్చింది. ‘మాయాబజార్’ (దాసరి దర్శకత్వంలో) అనే సినిమా కోసం వంశీ ఇంటర్నేషనల్ నిర్వహించిన కార్యక్రమంలో భక్తిపాటలు ఆలపించింది. ఆ గానానికి అబ్బురపడిన వంశీ రామరాజు తన ‘వేగేశ్న’ ఫౌండేషన్లో ఉద్యోగమిచ్చారు. సంగీతంలో శిక్షణ ఇప్పించే బాధ్యతా తీసుకున్నారు. కొలువు చేసుకుంటూనే కర్ణాటక, లలిత సంగీతం నేర్చుకుంది పద్మ. పద్యగానంపై పట్టు సాధించింది. మరోవైపు సినిమా ఫంక్షన్స్లో పాడేది. నాటకాలతోనూ మంచిపేరు తెచ్చుకుంది. వేగేశ్నలోని మిగతా దివ్యాంగ కళాకారులతో కలిసి దేశమంతా తిరిగి పౌరాణిక నాటకాలు వేసింది. కృష్ణుడు, పాండురంగడు, సత్యభామ.. ఏ పాత్రనైనా అలవోకగా పోషించింది. పురుష పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచింది. ఆరేండ్లపాటు సినిమా సెన్సార్ బోర్డు సలహామండలి సభ్యురాలిగా, నంది అవార్డు కమిటీ సభ్యురాలిగా వ్యవహరించింది.
గురువు మాటపై..
‘నీ జీవితం ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలి. నువ్వే ఓ సంస్థగా మారాలి. పదిమందికి మార్గం చూపించాలి’ అంటూ తొలి గురువు క్లారా చేసిన దిశానిర్దేశం పద్మను సామాజిక సేవవైపు నడిపింది. హైదరాబాద్ వేదికగా ‘పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్’ స్థాపనకు స్ఫూర్తినిచ్చింది. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారికి టైలరింగ్, కంప్యూటర్ విద్యతోపాటు సంగీత, నాటకాల్లోనూ శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. హయత్నగర్లోని మునగనూర్లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో దివ్యాంగులకు ఉచిత వసతి కల్పిస్తూ, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
మూడేండ్ల క్రితం.. పరీక్షలో వైఫల్యం కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆమెను కదిలించింది. దీంతో బాలబాలికల్లో ఆత్మవిశ్వాసం నింపాలని నిర్ణయించుకుంది. ఇరవైమంది కళాకారుల బృందంతో ‘తెలంగాణ దివ్యాంగుల కళాయాత్ర’ పేరిట రాష్ట్రమంతా తిరిగింది. అనేక కళాశాలలకు వెళ్లింది. తమ జీవితగాథలను, తాము ఎదుర్కొంటున్న అవమానాలూ అవహేళనలను వివరించింది. వైకల్య పరిమితులను అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న తీరును వివరించి.. విద్యార్థులకు స్ఫూర్తి నిచ్చింది. సిట్స్, పాటలు, నృత్యాలతో పిల్లల మనసులలో సానుకూల దృక్పథాన్ని పాదుకొల్పింది. బాలలు, మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. దివ్యాంగుల చట్టంపై అవగాహన కల్పిస్తున్నది. కరోనా సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు మూడుపూటలా అన్నం పెట్టింది. స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్న దివ్యాంగులను గుర్తించి అవార్డులనూ ప్రదానం చేస్తున్నది. దివ్యాంగుల హక్కుల చట్టానికి సంబంధించి తెలంగాణ అడ్వయిజరీ బోర్డ్ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నది పద్మప్రియ. ఆ జీవితకాల కృషి ఫలితంగానే.. జాతీయస్థాయిలో ‘సర్వశ్రేష్ఠ దివ్యాంగ్ జన్’ అవార్డుకు ఎంపికైంది.
సవాళ్లను స్వీకరించాలి
‘జీవితం సరళరేఖ కాదు. ఎత్తు పల్లాలు ఉంటాయి. సవాళ్లను స్వీకరించాలి. ధైర్యంగా మనదైన ప్రత్యేకతను చాటుకోవాలి’.. నా గురువులు నాకు చెప్పిన మాటలివే. ఇప్పటికీ ఆ మార్గంలోనే నడుస్తున్నా. క్రీడలు, కళల్లో రాణిస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని నా విన్నపం. – పద్మప్రియ