హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : లారీ ప్రమాదంలో దుర్మరణం పాలైన భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై విచారణ ప్రారంభమైంది. హనుమకొండలో మంగళవారం ఆయన అంత్యక్రియలు పూర్తయిన వెంటనే.. విచారణాధికారిగా నియమితులైన జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.
ప్రమాదానికి కారణమైన లారీ యజమాని వివరాలు, అతను లారీ నడుపుతున్న కంపెనీ వివరాలను తీసుకున్నట్టు తెలిసింది. ఘటనా స్థలానికి బుధవారం ఉదయం వెళ్లి.. ప్రత్యక్షసాక్షులను ఆయన విచారణ చేస్తారని తెలిసింది. ఇప్పటికే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల ద్వారా తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందేమోననే కోణంలో ఆయన దర్యాప్తు కొనసాగనున్నట్టు తెలుస్తున్నది.