బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్కు నిరాశ ఎదురైంది. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతాడనుకున్న లక్ష్యసేన్ ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. దిగ్గజ షట్లర్లు ప్రకాశ్ పదుకోన్, పుల్లెల గోపీచంద్, ప్రకాశ్నాథ్ తర్వాత ఫైనల్ చేరిన లక్ష్యసేన్ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో లక్ష్యసేన్ 10-21, 15-21 తేడాతో టాప్సీడ్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 53 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో అక్సెల్సన్కు దీటైన పోటీనివ్వడంలో లక్ష్య ఒకింత విఫలమయ్యాడు.
ఇటీవల జరగిన జర్మనీ ఓపెన్లో ఈ డెన్మార్క్ షట్లర్ను మట్టికరిపించిన సేన్..మరోమారు ఆ స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆందరూ ఊహించారు. కానీ అక్సెల్సన్ ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగాడు. తన అనుభవన్నంతా రంగరిస్తూ డ్రాప్ షాట్లు, పదునైన స్మాష్లతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. తన కంటే మెరుగైన ర్యాంక్లో ఉన్న ప్లేయర్కు దీటైన పోటీనిచ్చే క్రమంలో సేన్ తడబడ్డాడు. తొలి గేమ్లో 0-6తో వెనుకంజలో నిలిచిన లక్ష్యసేన్ మళ్లీ కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత పుంజుకున్నట్లు కనిపించినా..అక్సెల్సన్ ఏమాత్రం అవకాశమివ్వలేదు.
వరుస పాయింట్లతో ముందంజ వేశాడు. అదే జోరులో తొలి గేమ్ను 21-10ను కైవసం చేసుకున్నాడు. అయితే కీలకమైన రెండో గేమ్లో విక్టర్కు 4-4తో సమాధానమిచ్చిన లక్ష్యసేన్..దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. వరుసగా నాలుగు పాయింట్లతో అక్సెల్సన్ తన ఆధిక్యాన్ని 8-4కు పెంచుకున్నాడు. ఇక్కణ్నుంచి ఏమాత్రం వెనుకకు తగ్గని అక్సెల్సన్ గేమ్తో పాటు మ్యాచ్ను తన వశం చేసుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో అకానె యమగుచి విజేతగా నిలిచింది.