ODI World Cup | తిరువనంతపురం: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు రెండో వార్మప్ మ్యాచ్కు సిద్ధమైంది. మంగళవారం తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్తో రోహిత్ సేన తలపడనుంది. ఇంగ్లండ్తో జరగాల్సిన తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. గువాహటి నుంచి సోమవారమే భారత జట్టు తిరువనంతపురం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్కు కూడా వర్ష సూచన ఉండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ప్రతిష్ఠాత్మక టోర్నీకి ముందు ప్లేయర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వార్మప్ మ్యాచ్లు ఇలా వర్షార్పణం కావడంపై ప్లేయర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీమ్ఇండియాకు ప్రయాణాలతోనే సరిపోతున్నది.
సోమవారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ ఉండగా.. భారత ప్లేయర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ మాత్రం బీసీసీఐ అనుమతితో గువాహటి నుంచి తిరువనంతపురం కాకుండా.. వ్యక్తిగత అత్యవసర కారణాల వల్ల ముంబై వెళ్లినట్లు సమాచారం. కోహ్లీ భార్య అనుష్క శర్మ రెండోసారి తల్లి కాబోతున్నదని.. అందుకే విరాట్ అత్యవసరంగా దవాఖానాకు వెళ్లాల్సి వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రాక్టీస్ సెషన్కు దూరమైన విరాట్.. మంగళవారం ఉదయం తిరువనంతపురం చేరుకుంటాడని బోర్డు వెల్లడించింది. నెదర్లాండ్స్తో వార్మప్ మ్యాచ్లో కోహ్లీ పాల్గొంటాడని తెలిపింది. అయితే తిరువనంతపురంలో వాతావరణ పరిస్థితులు మ్యాచ్కు అనుకూలంగా లేవని తేలిపోయింది. సోమవారం ఇక్కడ జరిగిన పోరుకు వర్షం అడ్డు పడింది.