బొల్లారంలోని ఎనిమిదో వార్డు పరిధిలో కంటోన్మెంట్ క్వార్టర్స్ వెనుక భాగంలో ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం,పందుల సంచారంతో అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. దీంతో దోమలు విపరీతంగా విజృంభిస్తున్నాయి.కంటోన్మెంట్ బోర్డు అధికారుల నిర్ల్యక్షం కారణంగా చుట్ట్టు పక్కన కాలనీలు,బస్తీవాసులకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. ఏ రోజుకారోజు శుభ్రం చేయాల్సి ఉన్నా..వారానికి ఒకసారి వచ్చి తొలగిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి చెత్తను శుభ్రం చేస్తూ పందులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కంటోన్మెంట్ దవాఖాన సమీపంలోనే ఇలాంటి సమస్య నెలకొంది.చుట్టూ పక్కల కాలనీలు, బస్తీలు, పాఠశాలలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులు తరుచూ అనారోగ్యాల పాలవుతున్నట్లు చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పుడే పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి తాత్కాలిక పనులు చేపడుతున్నారు. తరువాత మళ్లీ యధాతథంగా తయారవుతుంది. ఇప్పటికైనా కంటోన్మెంట్ బోర్డు అధికారులు పట్టించుకోని అపరిశుభ్రత లేకుండా స్వచ్ఛ సర్వేక్షణ చేపట్టి జీఎచ్ఎంసీ మాదిరిగా చెత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కంటోన్మెంట్ క్వార్టర్స్ సమీపంలోని దుర్గంధంతో స్థానిక బస్తీ,కాలనీ ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.ప్రతి రోజూ డంపింగ్ వాహనాన్ని పంపించి చెత్త తొలగిస్తాం.మూగజీవులు సంచారం చేయకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం.
-అమిత్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్