ఇస్లామాబాద్: అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టు అయిన ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు ఊరట దక్కింది. ఆ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. ఇమ్రాన్ అరెస్టు చట్టవ్యతిరేకమని నిన్న సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఒక రోజు తేడాలో ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్కు బెయిల్ మంజూరీ చేసింది. జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్, జస్టిస్ సమాన్ రాఫత్ ఇంతియాజ్లతో కూడిన ధర్మాసనం ఇమ్రాన్కు బెయిల్ ఇచ్చింది. ఇమ్రాన్పై ఉన్న అన్ని కేసుల్ని ఒకేదగ్గరికి మార్చాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. కోర్టురూమ్ వద్ద భారీ బందోబస్తు నేపథ్యంలో విచారణ రెండు గంటలు ఆలస్యంగా సాగింది.
కోర్టు విచారణ సమయంలో ఇమ్రాన్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తన అరెస్టు కొనసాగితే అప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం అవుతాయని హెచ్చరించారు. అయితే ఇస్లామాబాద్ కోర్టు రెండు వారాల పాటు ఇమ్రాన్కు బెయిల్ ఇచ్చింది. కస్టడీ సమయంలో ల్యాండ్లైన్ ద్వారా తన భార్యతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు ఇమ్రాన్ వెల్లడించారు.