సంగారెడ్డి కలెక్టరేట్, మే 9: అనేక ఆవిష్కరణలకు నెలవైన ఐఐటీ హైదరాబాద్ తాజాగా వాటిని వ్యాపారం వైపు మళ్లించేందుకు అడుగులు వేస్తున్నది. ఇందుకు ఇంక్యుబేటర్ స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో ఐటీఐసీ (ఇండియన్ టెక్నాలాజికల్ ఇంక్యుబేషన్ సెంటర్) దేశవ్యాప్తంగా 8 అగ్రశ్రేణి స్టార్టప్లను ఎంపిక చేసింది. రూ.కోటీ యాభై లక్షలకు పైగా పెట్టుబడితో ఆయా స్టార్టప్లను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్మూర్తి వెల్లడించారు.
సోమవారం ఐఐటీహెచ్లో వివరాలను వెల్లడించారు. వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం రూపొందించే గేమ్ ఆధారిత లెర్నింగ్ ఫ్లాట్ఫామ్, హైడ్రోడైనమిక్స్ను ఉపయోగించి నీటి శుద్ధీకరణ వ్యవస్థను నిర్మిస్తున్న లిక్ష్యూర్ సిస్టమ్స్, ఆక్వా రైతుల కోసం అటోమెటెడ్ ఫీడింగ్ సిస్టమ్స్ను తయారుచేసే మిలాట్రానిక్స్, కొవిడ్ వంటి వైరస్లను తక్కువ ఖర్చుతో గుర్తించగలిగే టెస్టింగ్ కిట్లను తయారు చేసే ప్రాణహిత బయోట్రినిక్స్, చిగుళ్లు, పీరియాంటైటీస్ వంటి చికిత్సలో ఉపయోగించే పునరుత్పత్తుల కోసం పనిచేసే ఈ ఫోకేర్ వంటి అంశాలకు సంబంధించిన స్టార్టప్లు ఉన్నాయని వివరించారు.
వీటితో పాటు హ్యూమస్ బయోసిస్టమ్స్, రేబో సిస్టమ్స్, శ్రీదేవి మెషినరీ స్టార్టప్లపై రూ.10 లక్షల పెట్టుబడి పెట్టేందుకు ఐటీఐసీ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్ ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, స్టార్టప్స్ ఫ్యాకల్టీ ఇన్చార్జి ప్రొఫెసర్ సూర్యకుమార్ మాట్లాడుతూ..తమకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ముందుకొచ్చిన ఎన్ఎమ్డీసీ, హెడీఎఫ్సీ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.