సిటీబ్యూరో, నవంబర్ 29(నమస్తే తెలంగాణ): సమాజానికి జవాబుదారితనం, బాధ్యతతో సేవలు అందించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కొత్తగా విధుల్లో చేరిన సబ్ ఇన్స్పెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కు 2020 బ్యాచ్కు చెందిన 203 మంది ప్రొబెషనరీ ఎస్సైలను కేటాయించగా, 162 మంది డ్యూటీలో చేరారు. మరో 41 మంది డిసెంబర్ 30న చేరనున్నారు. విధుల్లో చేరిన కొత్త ఎస్సైలతో సోమవారం పేట్లబురుజు సిటీ ఆర్మూడ్ రిజర్వు(కార్) హెడ్ క్వార్టర్స్లోని పోలీస్ గ్రౌండ్లో సీపీ అంజనీకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో క్రమ శిక్షణ అనేది ముఖ్యమని, ప్రశాంతతకు భంగం కలుగకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిఒక్కరూ నిరంతరం ప్రయత్నించాలని సూచించారు. అదనపు సీపీ శిఖా గోయెల్, డీఎస్ చౌహాన్, ట్రాఫిక్ అదనపు సీపీ విజయ్కుమార్, కార్ హెడ్ క్వార్టర్స్ అదనపు సీపీ విక్రమ్సింగ్ మాన్ , జాయింట్ సీపీలు విశ్వప్రసాద్, ఏఆర్ శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.