సుల్తాన్బజార్, మే 22 : సంచలనాత్మక నగదు రవాణా దొంగతనం కేసును సుల్తాన్బజార్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని గుల్బార్గాలో పట్టుకొని రూ.9,53, 760 నగదును స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్బజార్ పీఎస్లో విలేకరుల సమావేశంలో ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లీ సుల్తాన్బజార్ ఏసీపీ మైనం మట్టయ్య,సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ జి నరేష్, ఎస్ఐ వేణుధారలతో కలిసి వివరాలను వెల్లడించారు. బోయిన్పల్లిలో నివసించే షేక్ రహమాన్ (46) కారు డ్రైవర్. ఈ నెల 19న కారులో క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాష్ కస్టోడియన్ గద్దం మల్లేష్, మరో కస్టోడియన్, గన్మ్యాన్తో కలిసి కారు డ్రైవర్ షేక్ రహమాన్ నగదు సేకరణ విధులకు బయలుదేరారు. ఇదిలా ఉండగా వివిధ వ్యాపార సంస్థల(డీ-మార్ట్,మాంగళ్య షాపింగ్ మాల్)నుండి నగదు సేకరించిన అనంతరం ఈ సొమ్మును జమ చేసేందుకుగాను మధ్యాహ్నం 2.20 గంట ల ప్రాంతంలో కోటి బ్యాంక్ స్ట్రీట్ లో ఉన్న ఎస్బీఐ ప్రధాన శాఖకు చేరుకున్నారు.
ఇద్దరు కస్టోడియన్లు కొంత నగదుతో బ్యాంకు లోపలికి వెళ్ళగా వాహనంలోని ఐదు సంచులలో ఉన్న 19 లక్షల నగదుతో తుపాకీతో ఉన్న దుండగుడు తాత్కాలికంగా వాష్రూమ్కు వె ళ్ళేందుకు గాను వాహనం నుండి బయటికి వచ్చాడు. ఇదే చాన్స్గా తీసుకున్న డ్రైవర్ షేక్ రహమాన్ నగదు ఉన్న వాహనంతో పారిపోయాడు. కింగ్కోఠి దవాఖాన సమీపంలో వాహనాన్ని వదిలేసి అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడు రెండు నగదు సంచులతో పారిపోయినట్లు గుర్తించారు. కాగా ఆ రెండు సంచులలో డీ-మార్ట్ నగదు సంచీలో రూ.5,88,932, మాంగళ్య నగదు సంచీలో రూ.3,74,533 మొత్తం రూ.9,63,465 దొంగిలించబడిందని గుర్తించా రు.
నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదు కాగా అధికార పరిధి కారణంగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. సీఎస్ఎస్ క్యాష్ కస్టోడియన్ గద్దం మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సుల్తాన్బజార్ పోలీసులు 48 గంటల్లోనే కేసును చేధించారు. కింగ్కోఠి జిల్లా దవాఖాన సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించగా నిందితుడు స్థానిక హలీం దుకాణం ముందు ఇన్నోవా క్రిస్టాను వదిలి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కాగా నిందితుడు పారిపోయిన ఆటో డ్రైవర్ను అనుసరించగా నిందితుడు లింగంపల్లికి వెళ్ళినట్లు గుర్తించారు. కర్ణాటకలోని గుల్బార్గాకు ప్రైవేట్ వాహనంలో వెళ్ళిపోయినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ కేసు చేధనలో పోలీసులు నిందితుడు, అతడి, భార్య కాల్ డేటా రికార్డ్స్ సాంకేతిక సెల్ విశ్లేషణలో గుల్బార్గా నుండి వచ్చిన అనుమానాస్పద ఇన్బౌండ్ కాల్ వెల్లడవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడు షేక్ రహమాన్ను అరెస్టు చేసి దొంగిలించిన రూ.9,53,760 నగదును స్వాధీనం చేసుకున్నారు.