సిటీబ్యూరో, మార్చి 4(నమస్తే తెలంగాణ): ‘మా తల్లిదండ్రులను మళ్లీ కలుస్తామో..లేదోనని..ఆందోళనకు గురయ్యాం. అక్కడ ఉన్న స్థానికులు, సేవా సంస్థలు మమ్మల్ని ఆదుకున్నాయి. మేమైతే క్షేమంగా ఇంటికి వచ్చాం.. మా తోటి మిత్రులు కూడా సురక్షితంగా స్వదేశానికి రావాలని ప్రార్థిస్తున్నాం’. అని యుద్ధభూమిగా మారిన ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లి.. నగరానికి క్షేమంగా తిరిగొచ్చిన విద్యార్థులు అన్నారు. ‘నమస్తే’తో అక్కడి అనుభవాలను పంచుకున్న వారు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్లో ఉజోర్డ్ నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సనత్నగర్లోని సుందర్నగర్కు చెందిన షేక్ అయూబ్ బాషా కుమార్తె షామా షేక్ (20) గురువారం రాత్రి హైదారాబాద్ చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో తనతో పాటు తన తోటి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారని వివరించింది. ‘ఉక్రెయిన్ రాజధాని కీవ్కు పశ్చిమాన ఉన్న ఉజోర్డ్ పట్టణానికి యుద్ధ భయం లేకున్నా.. ఉద్రిక్త వాతావరణం ఉండేది. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో 27న విశ్వవిద్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ తమకు అందిన ఆదేశాల మేరకు మేం సిద్ధమయ్యాం. బస్సులో ఉజోర్డ్ నుంచి చాప్ అనే గ్రామానికి, తిరిగి అక్కడి నుంచి జొహాని పట్టణం మీదుగా హంగేరీ చేరుకున్నాం.
అక్కడి ఇండియన్ ఎంబసీ వద్ద పేరు నమోదు చేయించుకున్న తరువాత హంగేరీ నుంచి నేరుగా ఢిల్లీకి చేరేందుకు విమాన టికెట్లు అందాయి. మార్చి 1న ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరాం.. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు సాయంత్రం 5 గంటలకు విమానం ఉండడంతో అప్పటివరకు తమకు తెలంగాణ భవన్లో బస కల్పించారు’ అని షామా షేక్ చెప్పింది. ‘రష్యా రాకెట్లతో దాడులు చేయడంతో ఎత్తయిన బిల్డింగులన్నీ కండ్లముందే నేలకూలాయి. ఎంత మంది చనిపోయారో ఎవరికీ తెలియదు. ఈ తరుణంలో ఇంటికి చేరుకుంటామా? అనే సందేహం కలిగింది. ఎట్టకేలకు మార్చి 2న హైదరాబాద్కు చేరుకుని నా తల్లిదండ్రులను చూసి ఒకింత ఉద్వేగానికి లోనయ్యా’ అని షేక్ షామా వెల్లడించింది.
ఆకలితో అలమటించినా..
నేను విన్సిత్ మెడికల్ యూనివర్సిటీలో 3వ సంవత్సరం చదువుతున్నాను. యుద్ధం నేపథ్యంలో ఆకలితో అలమటించినా.. బయటికి వెళ్లొద్దనే నిబంధనలు పాటించాం. అయినా ఇంటి వద్ద తల్లిదండ్రులు, బంధువులు భయపడుతారని మనోధైర్యం కోల్పోకుండా క్షేమంగానే ఉన్నానని సమాచారం ఇచ్చాను. విన్సిత్ నుంచి రొమేనియా సరిహద్దు వరకు 300 కిలోమీటర్లు.. విద్యార్థులమంతా కలిసి ప్రైవేట్ బస్సుల్లో రొమేనియా సరిహద్దుకు వచ్చాం. అక్కడి నుంచి ఓ చారిటీకి చెందిన వారు బస్సును ఏర్పాటు చేశారు. రొమేనియా ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నాం. శుక్రవారం ఉదయం 10.40 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగి ఇంటికి చేరుకున్నాను.
-జి.మురళీరెడ్డి, మెడిసిన్ విద్యార్థి,బృందావన్ కాలనీ, హయత్నగర్
15 కిలోమీటర్లు నడిచి..సరిహద్దుకు చేరుకున్నాం..
మమ్మల్ని ఏ ఎంబసీ వారు పట్టించుకోలేదు. మా వినిత్సియా యూనివర్సిటీ నుంచి రొమేనియా సరిహద్దుకు చేరడానికి ఇండియన్ కరెన్సీలో రూ.6వేలు ఖర్చు అయ్యింది. బోర్డర్కు 15 కిలోమీటర్ల ముందే మమ్మల్ని దింపేశారు. చలి, మంచును తట్టుకొని వేలాది మందితో కలిసి 15 కిలో మీటర్లు నడిచి సరిహద్దుకు చేరుకున్నాం. తిండిలేదు, నిద్ర లేదు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. హాస్టల్ కింద ఏర్పాటు చేసిన బంకర్లలో తలదాచుకున్నాం. ఆకలితో అలమటించాం. బిస్కెట్లు, పండ్లు కొనుక్కొని ఆకలిని తీర్చుకున్నాం. రెండు రోజులు బ్రెష్ కూడా వేసుకోకుండా నడక సాగించాం. ఎట్టకేలకు రొమేనియా చేరుకోగా అక్కడి మేయర్ ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడితే గానీ స్పందించలేదు. అక్కడి నుంచి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నాం. శుక్రవారం ఉదయం శంషాబాద్కు చేరుకొని కుటుంబ సభ్యులను కలిసి ఎంతో ఉద్వేగానికి గురయ్యా.
– కటిక వెన్నెల, యాచారం రంగారెడ్డి జిల్లా