హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల్లో ‘రిటర్న్ టు ఆఫీస్’ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. దీంతో ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’కు ఫుల్స్టాప్ పెట్టి రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు ‘హైబ్రిడ్ వర్కింగ్’ మాడల్ను అమల్లోకి తీసుకొస్తున్నాయి. ఈ విధానంలో ఉద్యోగులు వారంలో 2 రోజులు ఇంటిలో, 3 రోజులు ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. వారంతంలో శని, ఆదివారాలు సెలవులే. ఈ విధానంలో పనిచేసేందుకు ఎంత మంది ఆసక్తితో ఉన్నారో తెలుసుకొని తదనుగుణంగా ఐటీ కార్యాలయాల్లో క్యాబిన్లు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.
షిఫ్టుల వారీగా విధులు
హైదరాబాద్లోని బహుళజాతి ఐటీ కంపెనీల్లో, ప్రత్యేకించి లక్షల మంది ఉద్యోగులను కలిగివున్న మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, అసెంచర్, ఒరాకిల్, టెక్మహీంద్రా, డెలాయిట్ లాంటి దిగ్గజ కంపెనీల్లో ఒకేసారి వేలమంది పనిచేస్తుంటారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వారికి సీటింగ్ ఏర్పాట్లు చేయాలంటే ఎక్కువ స్పేస్ అవసరమవుతుంది. దీంతో ప్రస్తుతమున్న స్పేస్లోనే షిఫ్టుల వారీగా ఉద్యోగులందరితో పనిచేయించుకోవాలని ఆయా కంపెనీలు నిర్ణయించాయి. తదనుగుణంగా తమ కార్యాలయాలను సిద్ధం చేశాయి. కరోనా సమయంలో మరికొన్ని ఐటీ కంపెనీలు ఆఫీసు స్పేస్ను తగ్గించుకొని, పరిమిత స్పేస్లోనే కార్యకలాపాలను నిర్వహించాయి. ఇప్పుడు ఆయా కంపెనీలకు తిరిగివచ్చే ఉద్యోగులందరికీ ఆఫీస్ స్పేస్ను సిద్ధం చేసేందుకు చాలా సమయమే పడుతుంది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వర్కింగ్ విధానం అమలుతో అటు కంపెనీకి, ఇటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
హైబ్రిడ్ విధానంపైనే ఆసక్తి
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు రెండేండ్లుగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ విధానం వల్ల శారీరక, మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది ఉద్యోగులు చెప్తున్నారు. అమల్లోకి రానున్న హైబ్రిడ్తో ఇలాంటి ఇబ్బందులు దూరమవుతాయని తెలిపారు.