వారణాసి: జ్ఞానవాపి కేసులో ఇవాళ వారణాసి కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో మజీదు కమిటీ అంజుమన్ ఇంతజామియా వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కాశీలోని ప్రఖ్యాత విశ్వనాథ ఆలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉన్న విషయం తెలిసిందే. జ్ఞానవాపి మసీదు ఆవరణలోని గోడలపై ఉన్న హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అయిదుగురు మహిళలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటిషన్ను వారణాసి జిల్లా కోర్టు సమర్థించింది. జ్ఞానవాపి మసీదు వక్ఫ్ ప్రాపర్టీ కిందకు వస్తుందని అంజుమన్ కమిటీ కోర్టులో వాదించింది.
అయితే ముస్లింలు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది. హిందువులు వేసిన పిటిషన్ కోర్టులో చెల్లుతుందని కోర్టు చెప్పింది. సెప్టెంబర్ 22వ తేదీన ఈ కేసులో విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది. జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం జ్ఞానవాపి కేసులో తీర్పును వెలువరించింది. ముస్లిం పిటిషనర్లు ఈ కేసులో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పిటీషనర్ తెలిపారు.
మా శృంగార గౌరీ దేవిని పూజించేందుకు అనుమతి కోరుతూ హిందూ మహిళలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పిటీషనర్ సోహన్ లాల్ ఆర్య మాట్లాడుతూ.. హిందూ వర్గానికి ఇది పెద్ద విజయమన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భారత్ ఇవాళ సంతోషంగా ఉందని, హిందూ సోదరసోదరీమణులు దీపాలు వెలిగించాలని పిటీషనర్ మంజూ వ్యాస్ తెలిపారు.