హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఏపీఐడీసీ) బ్యాంకు ఖాతాల నుంచి తన వాటాకు మించి నగదును తీసుకోరాదని హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. బ్యాంకులో రూ.106 కోట్లు ఉంటే తన వాటాను మించి ఉపసంహరించుకుందని, నిధులు విడుదల చేయకుండా బ్యాంకులకు ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డితో కూడిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులతోపాటు ఏపీ ప్రభుత్వం, ఏపీఐడీసీలు పూర్తి వివరాలతో ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. డబ్బు విత్డ్రాపై ఏపీఐడీసీకి ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ఐడీసీ లిమిటెడ్ దాఖలుచేసిన పిటిషన్పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల అనంతరం హైకోర్టు.. ఏపీఐడీసీ తమ వాటా మేరకే నిధులు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.