హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ కేంద్రాన్ని డిమాండ్చేశారు. ప్రధానమంత్రిగా, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసి సంస్కరణల పీవీగా కీర్తిపొందిన ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. ఇప్పటికే తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో ఒక ప్రధాన రహదారికి పీవీ పేరు పెట్టాలని విజ్ఞప్తిచేశారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా బండా ప్రకాశ్ పలు అంశాలను పార్లమెంట్ దృష్టికి తెచ్చారు.
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే టీకాల్లో మూడోవంతు హైదరాబాద్లోనే తయారవుతున్నదని తెలిపారు. నగరంలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ సెంటర్, ల్యాబొరేటరీని ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ను కోరారని గుర్తుచేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం బాధాకరమని ఆయన చెప్పారు. తెలంగాణ (వరంగల్)లో రెండువేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)ను ఏర్పాటుచేశామని, దీన్ని బడ్జెట్లో ప్రకటించిన పార్కుల కింద తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిషన్భగీరథకు రూ.19,500 కోట్లు, మిషన్కాకతీయకు రూ.5000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేసినా కేంద్రం నుంచి నయాపైసా రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఓబీసీ, మహిళా రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి స్పష్టతలేదని చెప్పారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,17,483 కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలుచేయటంలేదని బండా ప్రకాశ్ ఆవేదన వ్యక్తంచేశారు. కోచ్ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఏర్పాటుచేస్తామని చెప్పి.. ఇంతవరకు పట్టించుకోలేదని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న నేషనల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ను విజయవాడకు తరలించారని, అదే సంస్థను హైదరాబాద్లో నెలకొల్పాలని డిమాండ్చేశారు. ఐటీఐఆర్పై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్, ఐఐఎం వంటి సంస్థల్ని నెలకొల్పాలని విజ్ఞప్తిచేశారు.