న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలకు ఇక ఇండియాలో కాలం చెల్లినట్లే. వీటికి అనుమతి ఇవ్వడం కాదు కదా.. మొత్తంగా నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. దీని ప్రకారం డిజిటల్ కరెన్సీని నిషేధించడమే కాదు.. అవి కలిగి ఉన్నా, వాటితో ట్రేడింగ్ చేసినా భారీ జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది మన దేశంలో బిట్కాయిన్, డోజ్కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలు కలిగి ఉన్నవారిపై ఈ చట్టం తీవ్ర ప్రభావం చూపనుంది. క్రిప్టోకరెన్సీలు కలిగి ఉండటం, వాటి జారీ, ట్రేడింగ్, బదిలీలను నేరంగా పరిగణించాలని కొత్త చట్టం ప్రతిపాదించినట్లు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. నిజానికి గత కొన్ని నెలలుగా క్రిప్టోకరెన్సీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నా.. ఈ మధ్య డిజిటల్ కరెన్సీకి అనుకూలంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆశలు రేపాయి. కానీ ఈ కొత్త చట్టం మాత్రం వారిని ఆందోళనకు గురి చేస్తోంది.
ఒకవేళ దీనిని చట్టం చేస్తే మాత్రం ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో క్రిప్టోకరెన్సీపై నిషేధం విధించిన తొలి దేశంగా ఇండియా నిలుస్తుంది. ఇప్పటి వరకూ చైనా దీని ట్రేడింగ్ను నిషేధించినా, ఆ కరెన్సీని కలిగి ఉండటాన్ని మాత్రం నేరంగా పరిగణించలేదు. అయితే జరిమానా విధించే ముందు ఇన్వెస్టర్లు తమ క్రిప్టో ఆస్తులను నగదు రూపంలోకి మార్చుకోవడానికి 6 నెలల వరకూ సమయం ఇవ్వనున్నట్లు ఆ అధికారి చెప్పారు. ఇండియాలో మొత్తం 70 లక్షల మంది దగ్గర క్రిప్టోకరెన్సీ ఉన్నట్లు భావిస్తున్నారు. వీళ్లు కనీసం 100 కోట్ల డాలర్లు వీటిలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. బిట్కాయిన్ విలువ 60 వేల డాలర్ల మార్క్ను దాటిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఇన్వస్టర్లకు మింగుడుపడటం లేదు. అయితే క్రిప్టోకరెన్సీలను మొత్తంగా నిషేధించే ఆలోచన తమకు లేదని ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వీటి విషయంలో అన్ని ద్వారాలు మూసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పడం గమనార్హం. అధికారిక క్రిప్టోకరెన్సీపై తుది నిర్ణయం ఆర్బీఐదేనని ఆమె స్పష్టం చేశారు.