హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా విద్యార్థులకే చెల్లించేలా నూతన మార్గదర్శకాలను రూపొందిస్తూ జారీ చేసిన జీవో 7ను ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. బకాయి నిధులను తక్షణం చెల్లించాలని కోరారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మినిస్టర్ క్వార్టర్స్లో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రితో చర్చించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, జీవో 7ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్ణయం వల్ల 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని అన్నారు. తక్షణం రూ. 10 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. గురుకులాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ సీటు ఇవ్వాలని విన్నవించారు.
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులకు గొడ్డలిపెట్టులా మారిన జీవో 7ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యావారోత్సవాల సందర్భంగా నిరసన తెలిపేందుకు వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్వీ నేతలు సతీశ్, రాజేశ్ నాయక్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అలవికాని హామీలిచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. రేవంత్రెడ్డి పాలనలో మహిళల భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్ను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్వీ నేతలపై కాంగ్రెస్ సర్కార్ నిర్బంధకాండను ప్రయోగిస్తున్నదని విమర్శించారు. రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా పోరాటాన్ని ఆపబోమని ఆయన హెచ్చరించారు.