ఖైరతాబాద్, డిసెంబర్ 6: అధునిక విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో నూతనంగా ‘డాటా సైన్స్’ కోర్సును ప్రవేశపెట్టామని ఒడిన్ స్కూల్ సీఈఓ విజయ్ పసుపులేటి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎంత ముఖ్యమో.. డా టా సైన్స్ కూడా అంతే ప్రాధాన్యతతో కూడిన సబ్జెక్టు అని అన్నారు. యువత, నిరుద్యోగులు, గృహిణులు ఎవరైనా ఈ కోర్సును చేయొచ్చని, కనీస అర్హత డిగ్రీ అని, ఆర్నెళ్ల వ్యవధిగా ఈ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత వారికి సర్టిఫికెట్లతో పాటు ఆ రంగంలో అవకాశాలు కల్పించేందుకు తగిన చొరవ చూపిస్తామన్నారు.
కోర్సుల్లో చేరేందుకు అర్హత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని, అత్యంత ప్రతిభ కనబర్చిన మహిళలను ఈ కోర్సులో ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లను సైతం అందజేస్తున్నామన్నారు. ఈ కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల కోసం ఒక కోటి రూపాయల వరకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. వివరాలకు www.odinschool. com వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. స్కూల్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాధిపతి శ్రీనివాస్ కులకర్ణి, ఇండస్ట్రీ, ప్లేస్మెంట్ విభాగాధిపతి శృతి పాల్గొన్నారు.