న్యూఢిల్లీ, జూన్ 19 : బంగారం ధరలు మరింత తగ్గాయి. వరుసగా నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర శుక్రవారం రూ.1.5 లక్షల స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,840 తగ్గి రూ.1,50,600కి పడిపోయింది. అంతకుముందు ఇది రూ.1,53,440గా ఉన్నది. డాలర్కు డిమాండ్ పడిపోవడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
పసిడితోపాటు వెండి ధరలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.8,040 తగ్గి రూ.2,40,700కి పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న నమోదైన రూ.2.40 లక్షల స్థాయికి పడిపోయినట్టు అయింది. అమెరికా వడ్డీరేట్లు అధిక స్థాయిలో ఉండవచ్చన్న అంచనాలతో పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గుచూపడంతో బులియన్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.