German Bank Heist |జర్మనీలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గెల్సెన్కిర్చెన్లోని స్పార్కాస్కై బ్యాంకులో రూ.316 కోట్లను దోపిడీ చేశారు. క్రిస్మస్ సెలవులు కావడంతో రెండు రోజులు బ్యాంకులోనే ఉండి 3250 సెఫ్టీ డిపాజిట్లను కొల్లగొట్టారు. అలాగే లాకర్లలోని నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుయర్ ప్రాంతంలో ఉన్న స్పార్కాసై బ్యాంకు శాఖను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజి నుంచి బ్యాంకులోకి ప్రవేశించారు. గ్యారేజి నుంచి భూగర్భంలో ఉన్న వాల్ట్ రూమ్కు డ్రిల్తో రంధ్రం చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. మూడు వేలకు పైగా సేఫ్ డిపాజిట్ బాక్సులను పగులగొట్టి, అందులోని నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అయితే సోమవారం తెల్లవారుజామున ఫైర్ అలారం మోగడంతో ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది.
బ్యాంకు దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. వాల్ట్రూమ్ దగ్గరలో రంధ్రాన్ని గుర్తించారు. ఇక శని, ఆదివారం మధ్య రాత్రి సమయంలో గ్యారేజీ మెట్ల వద్ద కొందరు వ్యక్తులు పెద్ద సంచులు మోసుకుంటూ వెళ్లడం చూశామని సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. బ్యాంకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సోమవారం ఉదయం మాస్కులు ధరించి వ్యక్తులు బ్లాక్ కలర్ ఆడి 6 కారులో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. క్రిస్మస్ సెలవులను అదునుగా చేసుకుని దొంగలు బ్యాంకును లూటీ చేశారని పోలీసులు తెలిపారు. సెలవు ఉన్న రెండు రోజులు దొంగలు బ్యాంకులోనే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
మొత్తం సేఫ్ డిపాజిట్ బాక్సుల్లో 95 శాతం వరకు దోపిడీకి గురైనట్లుగా బ్యాంకు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు పరిమితి విలువ 10,300 యూరోలు అని తెలిపారు. దీంతో మొత్తం నష్టాన్ని సుమారు 30 మిలియన్ యూరోలు (రూ. 316 కోట్లు)గా అంచనా వేస్తున్నారు. కాగా, బ్యాంకులో దోపిడీ జరిగిందని తెలియడంతో కష్టమర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. మంగళవారం నాడు పెద్ద సంఖ్యలో కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళన చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకును మూసివేశారు. కస్టమర్ల ఆందోళన నేపథ్యంలో హాట్ లైన్ ఏర్పాటు చేసి, బాధితులకు రాతపూర్వకంగా సమాధానమిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. బీమా కంపెనీతో కలిసి క్లైయిమ్ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ఈ ఘటన తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కస్టమర్లకు అండగా ఉంటామని చెప్పారు.