లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల పర్వానికి బ్రేక్ పడటం లేదు. బదౌన్ జిల్లా షేక్పూర్ పోలీస్ చౌకి ప్రాంతంలో పోలీస్ అవుట్పోస్ట్లోనే సామూహిక లైంగిక దాడి జరిగిందనే వార్తలు కలకలం రేపాయి. పోలీస్ అధికారి సహా నలుగురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని అంగన్వాడీ కార్యకర్త ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. పోలీస్ పోస్ట్ ఇన్చార్జ్ సహా నలుగురు వ్యక్తులు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఈనెల 5న స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తాను పనిచేస్తున్న పాఠశాలకు ఇద్దరు మహిళలు వచ్చి ప్రభుత్వ రికార్డులు, ఆహారాన్ని గుంజుకెళ్లారని, దీనిపై విమెన్ హెల్ప్లైన్ను ఫిర్యాదు చేశానని బాధిత మహిళ చెప్పుకొచ్చారు. మార్చి 4న మాట్లాడాలని తనను పోలీస్ పోస్ట్కు పిలిపించి పోలీస్ అధికారితో పాటు నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. మరోవైపు మార్చి 4న అంగన్వాడీ కార్యకర్త భర్త తనను వేధిస్తున్నాడని ఆమె ప్రత్యర్ధి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం విశేషం. ఇక తన భర్తను లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడవేసేందుకే మహిళ సామూహిక లైంగిక దాడి ఆరోపణలు చేస్తోందని పోలీసులు చెబుతున్నారు.