కుభీర్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ( Ganesh festivities ) ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకోనున్న ఘననాథుడికి ఊరూరా భక్తిశ్రద్ధలతో ఉత్సవా లను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా ( Nirmal District ) కుభీర్ మండలం పార్డి-కె గ్రామంలోని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో వినాయక ప్రతిష్టాపన కార్యక్రమం కనుల పండువగా సాగింది.
వేద పండితులు సూచించిన సుముహూర్తం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1గం. లకు భక్తి శ్రద్ధలతో గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళ హారతులు ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘ గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రతిష్టాపన కార్యక్రమంలో సర్పంచ్ బందెల గంగామణి సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు దుంపేటి రాములు, మాజీ ఎంపీటీసీ బందెల శంకర్, లంక పోశెట్టి గోజల గజ్జరం, సాతం విట్టల్, పూజారి వడ్ల నాగేష్, ఆకుల పోశెట్టి, ఎగ్గామ్ సాయినాథ్, గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుబీర్ తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.