స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 30: బతికున్నప్పుడు మనం చేసిన మంచి పనులే చనిపోయాక కూడా నిలిచి ఉంటాయి అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. తనకు పది రోజులపాటు ఆశ్రయం కల్పించి అన్నం పెట్టిన ఓ పెద్దమనిషి చనిపోతే.. ఆయన అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం కిష్టాపురంతండాలో మంగళవారం చోటుచేసుకున్నది. జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి(జి) గ్రామానికి చెందిన దాసరి హన్మయ్య 20 ఏండ్ల వయసులో కులాంతర వివాహం చేసుకున్నారు.
ఆ సమయంలో కిష్టాపురానికి చెందిన బోడ బుచ్చమ్మ, సోమ్లనాయక్ దంపతులు పదిరోజులపాటు నవ దంపతులకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. అనంతరం బిజినెస్ చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందిన హన్మయ్య.. ఆ కుటుంబసభ్యుల రుణం తీర్చుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో సోమ్లనాయక్ కుమారుడు రవినాయక్ రెండేండ్ల క్రితం చనిపోయాడు. అతడి కుమార్తె పూజిత వివాహం నవంబర్ 20న హన్మయ్య జరిపించారు. తండ్రి స్థానంలో కట్నం ఇచ్చి కన్యాదానం చేశారు. ఇది జరిగి పదిరోజులు కూడా కాకముందే మంగళవారం సోమ్లనాయక్ (75) అనారోగ్యంతో మృతిచెందగా, కొడుకు స్థానంలో తలకొరివి పెట్టారు.