శేరిలింగంపల్లి, మార్చి 6 : ‘ఇండస్ వీవా’ పేరుతో బెంగళూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ అమాయకులను ఉబిలోకి లాగి.. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 24 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేండ్లలో దాదాపు 10 లక్షల మందికి పైగా చీట్చేసి.. రూ.1500 కోట్ల వ్యాపారం నిర్వహించినట్లు గుర్తించారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.
బెంగళూర్కు చెందిన అభిలాష్ థామస్ 2014లో ‘ఇండస్ వీవా’ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. అదే ప్రాంతానికి చెందిన ప్రేమ్కుమార్ను ఈ సంస్థకు చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నియమించాడు. కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించారు. రూ. 12500 సభ్యత్వం తీసుకుంటే.. అంతే విలువగల వివిధ ఆరోగ్య ఉత్పత్తులు ఇస్తామని నమ్మిస్తూ.. లక్షలాది మందిని ఈ మల్టీలెవల్ స్కీంలో చేర్పించి మోసాలకు పాల్పడ్డారు. ఒకరు సభ్యత్వం తీసుకొని.. వారు మరో ఇద్దరిని సభ్యత్వం చేయించాలని… ఇలా అందరూ తలా ఇద్దరిని చేస్తూపోతే లక్షల రూపాయలు కమీషన్, బోనస్ల రూపంలో వస్తాయని నమ్మించారు. ఒక్కొక్కరు 9 వారాల్లో 1022 మందిని ఈ స్కీంలో చేర్పించాలని టార్గెట్ పెట్టి.. వారికి ప్రత్యేకంగా గ్రేడ్ పేరిట హోదాలు ఇస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఇలా 6 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల మందికిపై ఈ స్కీమ్లో చేర్పించి.. దాదాపు రూ.1500 కోట్ల మేర వ్యాపారం చేశారు.
ఇటీవల ఓ బాధితుడు గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసుల దర్యాప్తులో ‘ఇండస్ వీవా ’ సంస్థ మోసాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూర్కు చెందిన ఈ సంస్థ సీఈఓ అభిలాష్ థామస్, ప్రేమ్కుమార్తో కలిపి మొత్తం 24 మందిని అరెస్ట్ చేశారు. ఈ 24 మంది లో యాదగిరిగుట్ట, మిర్యాలగూడ, హయత్నగర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు ప్రభుత్వ టీచర్లు సైతం ఉన్నారు.
విలాసవంతమైన జీవితం, విదేశీ యాత్రలు, డైమండ్ హోదాలు, లగ్జరీ హోటళ్లు, రిసార్టుల్లో బస.. ఇలా ఆశపెట్టి ఎలాంటి గుర్తింపు లేని ఆరోగ్య ఉత్పత్తులను అమాయకులకు ముట్టజెప్పి మోసాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐ గ్లో, ఐ కేర్, ఐ చార్జ్, ఐ కాఫీ, , ఐ పల్స్, అడ్వాన్స్ ఆయుర్వేద, ఐ స్లిమ్ పేరిట ఆరోగ్య ఉత్పత్తులు విక్రయిస్తూ ఈ స్కీం పేరుతో మోసాలకు పాల్పడ్డారు. ఈ ఆరోగ్య ఉత్పత్తులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి గుర్తింపు లేదని సీపీ వెల్లడించారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లుతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
బెంగళూర్కు చెందిన సంస్థ సీఈఓ అభిలాష్ థామస్, సీఓఓ ప్రేమ్కుమార్, మండలనేన్ సుభ్రమణ్యణ్, ఇమాదుల్లా షరీఫ్, సీకే సుజీద్, రంగనాథన్, హైదరాబాద్కు చెందిన నూర్ మహ్మద్, సరూర్నగర్కు చెందిన మల్లెరంగారెడ్డి, కోకాపేటకు చెందిన కొండ శ్రీనివాసులు, నాగోల్కు చెందిన నామిరెడ్డి అశోక్రెడ్డి, హయత్నగర్కు చెందిన కేసీఎస్ శర్మ, ఎల్బీనగర్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంకు చెందిన కాసాని కేశవరావు, నాగలక్ష్మి, విజయవాడకు చెందిన రామకృష్ణ, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్ కుమార్, నెల్లూర్కు చెందిన బాలసారథి, యాదాద్రికి చెందిన ములుగు వెంకటేశ్, నాగదేవి, బోగా సూర్యనారాయణ, మిర్యాలగూడకు చెందిన మన్నెపు హరిప్రసాద్, రేణుకా, కోదాడకు చెందిన ఉపేందర్, సౌజన్యలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.