అత్తాపూర్, జనవరీ 25: హైదర్గూడ హిందూ శ్మశాన వాటికకు ఐదెకరాల స్థలం కేటాయిస్తామని మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హామీ ఇచ్చారు. అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడ మూసీ వద్ద శ్మశాన వాటికను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్రెడ్డితో మంగళవారం కలిసి ఆయన పరిశీలించారు. కొద్ది రోజులుగా శ్మశాన వాటిక అభివృద్ధి విషయంలో మూసీ డెవలప్మెంట్, రెవెన్యూ అధికారులు అడ్డుపడుతుండటంతో మంగళవారం అన్ని శాఖల అధికారులతో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆహ్వానం మేరకు వచ్చినట్టు తెలిపారు.
శ్మశాన వాటిక వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, ప్రసుత్తం మూసీనది అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, హైదర్గూడ మూసీనది నుంచి నాగోల్ వరకు పెద్ద ఎత్తున మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. దీని కారణంగా ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటిక రోడ్డు వెడల్పులో భాగంగా కనుమరుగయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో ఎప్పటికైనా శ్మశానవాటికకు ఇబ్బంది అని, పక్కనే మూసీకి ఆనుకొని 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నుంచి ఐదెకరాల స్థలాన్ని హైదర్గూడ హిందూ శ్మశాన వాటికకు కేటాయించి, సుందరంగా నిర్మిస్తాం అని ఆయన తెలిపారు.
అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికను ఉపయోగించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన శ్మశాన వాటిక నిర్మాణం జరిగే వరకు అన్ని శాఖల అధికారులు సహకరిస్తారని ఆయన హమీ ఇచ్చారు. ఇందుకు వెంటనే స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్కు లేఖ రాస్తామని అన్నారు. మూసీ అభివృద్ధిలో భాగంగా భఫర్జోన్లో నిర్మించిన నిర్మాణాలు తొలగిస్తామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే హైదర్గూడ శ్మశాన వాటికకు ఐదెకరాలు కేటాయించి శంకుస్థాపన చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు, స్థానిక కార్పొరేటర్ సంగీత, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.