(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): చెరుకు పంటకు మద్దతు ధర ప్రకటించాలంటూ హర్యానా రైతులు ఆందోళన బాట పట్టారు. క్వింటాలు చెరుకు ధరను రూ.362 నుంచి రూ.450కి పెంచాలంటూ చెరుకు రైతులు హర్యానాలోని పలు గ్రామాల్లో నిరవధిక నిరసనలు మొదలుపెట్టారు. ఇప్పటికే 14 చెరుకు మిల్లులకు తాళాలు వేశారు. అంబాలాలోని నారైన్ఘర్ షుగర్ మిల్స్, కురుక్షేత్రలో శహాబాద్ షుగర్ మిల్స్, కర్నాల్లోని పిక్కఢిల్లీ షుగర్ మిల్స్, భాడ్సన్ షుగర్ మిల్స్, కర్నాల్ కో-ఆపరేటివ్ షుగర్ మిల్, అస్సాంద్లోని హఫీద్ షుగర్ మిల్స్, నారాయణగఢ్, మోహమ్ టౌన్, భాలి ఆనంద్ పూర్, యమునానగర్లలోని చక్కెర మిల్లుల గేట్లను ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. రైతులందరూ ఆయా మిల్లుల ముందు బైఠాయించి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా పోలీసులను మోహరించినా చెరుకు రైతులు వెనక్కు తగ్గటం లేదు. ప్రభుత్వం తమ డిమాండును నెరవేర్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెరుకు క్రషింగ్ పనులను మొదలు పెట్టనియ్యమని రైతు నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనను తీవ్రం చేస్తామని బీకేయూ తెలిపింది.
పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే చెరుకు మద్దతు ధరను పెంచినా, హర్యానా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనక్కు తగ్గేదిలేదు. రెండురోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం.
– గుర్నామ్ సింగ్ చారుని, బీకేయూ(చారుని) అధ్యక్షుడు