సిటీబ్యూరో, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకలను నిషాలో ఎంజాయ్ చేయాలనుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ను తీసుకువచ్చిన ముగ్గురు స్నేహితులు రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరి దగ్గర నుంచి నాలుగు రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని విజయనగర్ కాలనీకి చెందిన మహ్మద్ జమీర్ సిద్దిఖీ, హఫీజ్పేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పులి రమ్య, నంది హిల్స్, అల్మాస్గూడకు చెందిన కౌకుంట్ల అఖిల్ సోషల్ మీడియా వేదికైన క్లబ్ హౌజ్ యాప్లో స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఈ ముగ్గురు గచ్చిబౌలిలోని ఓ పబ్లో పరిచయమై.. మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మహ్మద్ జమీర్ తాను గోవా నుంచి డ్రగ్స్ తెచ్చుకుంటానని వాటిని సేవించి అలసట లేకుండా గంటల కొద్దీ పబ్లలో చిందేసి జల్సా చేస్తానని చెప్పాడు. అతడి మాటలకు రమ్య, అఖిల్ ఆకర్షితులయ్యారు. దీంతో జమీర్ తెచ్చుకున్న డ్రగ్స్లో నుంచి కొంత వారికి ఇచ్చి మత్తెక్కించాడు.
సోషల్ మీడియా వేదికైనా క్లబ్ హౌజ్ యాప్లో ప్రపంచ వ్యాప్తంగా ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఇతరులు మాట్లాడుకునేది కూడా వినవచ్చు. ఇలా ఈ యాప్లో జమీర్, రమ్య, అఖిల్లు చేరారు. దీంట్లో జమీర్ డ్రగ్స్కు సంబంధించి ఇతరులతో మాట్లాడుతుండగా రమ్య, అఖిల్ కలిసి మాట్లాడేందుకు ఆసక్తిని చూపించారు. దీంతో యాప్లో ఉండే రూమ్ అప్షన్లోకి వెళ్లి అందులో జమీర్తో మాట్లాడారు. ఇలా మాట్లాడుకుని వారు పబ్లో కలిసి దోస్తులయ్యారు. ఈ విధంగా డ్రగ్స్ను గోవా నుంచి తెచ్చుకుని గంటల తరబడి పబ్లలో చిందులు వేస్తున్నారని తెలిసింది.
కొత్త సంవత్సరం వేడుకల్లో ఫుల్ హంగామా చేద్దాం. అలసట రావద్దంటే డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేస్తే మంచిదని అభిప్రాయానికి వచ్చారు. డ్రగ్స్కోసం జమీర్ ఇటీవల రమ్య, అఖిల్ను గోవాకు పంపించాడు. ఎవరికీ అనుమానం రాకుండా మెటమ్ఫెటామైన్ 6.1 గ్రాములు, ఎండీఎంఏ 1.6 గ్రాములు, ఎల్ఎస్డీ బ్లాట్ చిప్స్ 0.4 గ్రాములు, గంజాయి 1.3 గ్రాములు తీసుకురావాలని చెప్పిన జమీర్ ఫోన్పే ద్వారా రూ.23,600 పంపించాడు. గోవా నుంచి మత్తు పదార్థాలను తీసుకుని వచ్చి పోలీసులకు దొరికిపోయారు. వీరిని ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.