భోపాల్: సహజీవనం చేస్తున్న నర్సును ఒక డాక్టర్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హర్పురా ప్రాంతానికి చెందిన సంజీవ్ శర్మ వృత్తి రిత్యా వైద్యుడు. మరి కొందరు డాక్టర్లతో కలిసి రుద్రాక్ష హాస్పిటల్ను నిర్వహిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్లోని ఇటావాకు చెందిన సోనమ్ యాదవ్, ఆ ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ పొందుతుంది. డాక్టర్ సంజీవ్ శర్మతో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
కాగా, సంజీవ్ శర్మ మొబైల్ ఫోన్లోని వాట్సాప్లో ఒక మహిళతో అసభ్యకర మెసేజ్పై సోనమ్ నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవకు ఇది దారి తీసింది. ఆగ్రహం చెందిన సంజీవ్ శర్మ, గొంతు నులిమి సోనమ్ను హత్య చేశాడు. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీలింగ్కు వేలాడదీసి ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత ఇంటికి తిరిగి వచ్చి సోనమ్ ఆత్మహత్య చేసుకుందంటూ హంగామా చేశాడు.
మరోవైపు స్థానికుల ద్వారా ఈ విషయం తెలిసి అక్కడకు వచ్చిన పోలీసులు డాక్టర్ సంజీవ్ శర్మను అనుమానించారు. ఆయనను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. వాట్సాప్ చాట్పై వివాదం నేపథ్యంలో ఆగ్రహంతో సోనమ్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు సంజీవ్ శర్మను అరెస్ట్ చేశారు. సోనమ్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, సంచలనం రేపిన వ్యాపమ్ కుంభకోణంలో డాక్టర్ సంజీవ్ శర్మ నిందితుడని పోలీసులు వెల్లడించారు.