న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు దారిదోపిడీ దొంగలు దారుణానికి ఒడిగట్టారు. బైక్పై వెళ్తూ ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించారు. అక్కడి నుంచి పారిపోతూ దారిలో కనిపించిన మరో మహళ మెడలో బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి సదరు మహిళ తప్పించుకోగా.. రోడ్డు పక్కనే తినుబండారాలు అమ్ముకునే దుకాణం నిర్వహిస్తున్న నేపాలీ మహిళ ఛాతిలో బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. సమీర్, అతని మేనల్లుడు ఫైజాన్ (25) కలిసి బుధవారం రోహిణి ఏరియాలో ఇద్దరు మహిళలను అడ్డగించారు. వారికి తుపాకీ చూపి బెదిరిస్తూ వారి నుంచి బంగారు ఆభరణాలు లాక్కుకున్నారు. అక్కడి నుంచి పారిపోతూ తిమార్పూర్ ఏరియాలో ఒంటరిగా తారసపడ్డ మరో మహిళను దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే సదరు మహిళ వారితో పెనుగులాడటంతో తప్పించుకోవడం కోసం ఆమెపై కాల్పులు జరిపారు. కానీ ఆమె పక్కకు తప్పుకోవడంతో బుల్లెట్ నేరుగా వెళ్లి రోడ్డు పక్కన తినుబండారాల దుకాణం నిర్వహిస్తున్న మీనా (45) అనే నేపాలీ మహిళకు తగిలింది.
స్థానికులు వెంటనే మీనాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం గీతా కాలనీ ఏరియాలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.