తిరుమల: హనుమంతుని జన్మస్థలంపై జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో టీటీడీకి, హనుమాన్ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టుకు మధ్య చర్చ జరిగింది. గురువారం జరిగిన చర్చలో టిడిపి సాంస్కృతిక విద్యాపీఠం వీసీ మురళీధర్ శర్మ, టీటీడీ ప్రత్యేక కార్య నిర్వహణాధికారి ధర్మారెడ్డి, హనుమాన్ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు తరఫున గోవిందానంద స్వామి పాల్గొన్నారు. టీటీడీ ఆధారాల్లో తప్పులు ఉన్నాయని స్వామి గోవిందానంద సరస్వతి అన్నారు. టీటీడీ పూర్తి నివేదిక అందిస్తే తప్పులు చూపిస్తానని పేర్కొన్నారు. స్వామీజీకి నివేదిక ఇవ్వడానికి టీటీడీ నిరాకరించింది. అంజనాదేవి తిరుమలలోనే హనుమంతుడికి జన్మనిచ్చిందనేది టిటిడి వాదన. కాదు హనుమంతుడు కిష్కింధలోనే జన్మించాడని గోవిందానంద స్వామిజీ వాదన. పూర్తి నివేదిక ఇస్తేనే మాట్లాడతానని గోవిందానంద స్వామీజీ పట్టుబట్టడంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది.గత ఏప్రిల్ 13న ఉగాది సందర్భంగా టీటీడీ తిరుమలలోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలమని ప్రకటించింది. శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శన శర్మ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల నిపుణుల కమిటీ 2020 డిసెంబర్ లో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ప్రకటన వెలువడింది. అనేకసార్లు సమావేసమైన కమిటీ ప్రాచీన గ్రంథాల నుంచి సేకరించిన ఆధారాలతో నివేదికను రూపొందించి టీటీడీకి సమర్పించింది. కర్నాటకలోని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మే నెల మొదటివారంలో టీటీడీ వాదనను ప్రశ్నిస్తూ ఆరు పేజీల లేఖను రాసింది. కమిటీ నివేదిక భక్తులను తప్పుదారి పట్టించేదిగా ఉందని పేర్కొన్నది. కర్నాటకలోనిు కొప్పల్లో కిష్కింధ పర్వతాల్లో హనుమంతుడు జన్మించినట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ట్రస్టు స్పష్టం చేసింది. వాల్మీకి రామాయణంతో పాటుగా పలు ఇతర గ్రంథాల నుంచి సాక్ష్యాలను ఉటంకించారు. దానికి జవాబుగా టీటీడీ బహిరంగ చర్చకు సవాల్ చేసింది.