మద్యం ఓ దురలవాటు. మాదక ద్రవ్యం ఓ తీవ్ర వ్యసనం. రెండూ బలమైనవే. మనిషిని బలహీనుడిని చేసేవే. ఒక్కసారి ఆ ఊబిలో చిక్కుకుంటే బయటపడటం కష్టం. అయితేనేం, సంకల్ప శక్తితో మత్తును చిత్తు చేయవచ్చు, మద్యం మదం దించేయవచ్చు. ఆ ప్రయత్నంలో డీ-ఎడిక్షన్ చికిత్స తోడుగా నిలబడుతుంది. వ్యసనపరుడికి పునర్జన్మనిస్తుంది.
‘మత్తు’ జీవితాలను చిత్తు చేస్తున్నది. ఆ మైకంలో పడి యువతీ యువకులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. విచక్షణ మరచి సమాజానికి కీడు తలపెడుతున్నవారూ ఎంతోమంది. ఫలితంగా, సమాజం ముందు ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి. సైదాబాద్ సింగరేణి కాలనీ సంఘటన అయినా, సైబరాబాద్ ‘అభయ’ ఉదంతం అయినా, శంషాబాద్ ‘దిశ’ కేసు అయినా.. ఈ దురదృష్టకర పరిణామాల్లో ‘మత్తు’ పదార్థ్ధాలే కీలక పాత్ర పోషించాయి. నిందితులు వేరువేరు మత్తు పదార్థాలు తీసుకుని ఉండవచ్చు. కానీ ఆ ఫలితాలు మాత్రం అనేక జీవితాలను ప్రభావితం చేశాయి. గంజాయి, కొకైన్, బ్రౌన్షుగర్, ఎండీఎం బ్లాస్ట్, అశిష్ తైలం.. తదితర డ్రగ్స్ యువతను పెడదారి పట్టిస్తున్నాయి. హద్దుల్లేని మద్యం అలవాటు సైతం మనిషిని క్రూర మృగంగా మారుస్తున్నది.
మత్తు వలలో ఇలా..
పుట్టుకతోనే ఎవరూ మద్యానికో మత్తుమందుకో బానిసలైపోరు. చుట్ట్టూ ఉన్న వాతావరణం, చెడు స్నేహాలు, మానసిక స్థితి, కుటుంబ చరిత్ర.. అన్నీ కలిసి ఆ ఊబిలోకి నెట్టేస్తాయి.
..మత్తు పదార్థాలు కావచ్చు, మద్యపానం కావచ్చు. ఏదైనా సరే.. ఈ మూడు దశల్లోనే మనిషి బానిసత్వపు సుడిగుండంలో చిక్కుకుపోతాడు.
అలవాటు
ఇది ప్రాథమిక దశ. ఈ దశలో ఇతరులను చూసో, ఇతరుల బలవంతం మీదో మత్తు పదార్థాలను రుచి చూస్తారు. ఓ సరికొత్త అనుభూతిని పొందుతారు. కొంతమంది మాత్రం, తొలిసారి రుచిచూసి వదిలేస్తారు. ఇక ఆ జోలికి వెళ్లరు. మరికొందరు ఆ అనుభూతిని మళ్లీ మళ్లీ కోరుకుంటారు. సరిగ్గా ఇలాంటి వారే డ్రగ్స్కు, మద్యపానానికి అలవాటు పడతారు.
ఆధారం
ఇది డిపెండెన్స్ దశ. ఈ దశలో మత్తు పదార్థాలపై పూర్తిగా ఆధారపడతారు. రోజూ తీసుకునేంతగా దిగజారిపోతారు. ఆ మత్తు అందకపోతే ఉక్కిరిబిక్కిరి అవుతారు.
బానిసత్వం
తొలిసారి రుచి చూసినవారు రెండోసారి కూడా ఏదో ఒక సాకు చెప్పి.. ఇంకా ఇంకా ఆ మత్తు మందు తీసుకుంటారు. గతంతో పోలిస్తే పరిమాణమూ పెరుగుతుంది. సంతోషం, విషాదం.. సందర్భం ఏదైనా సరే మత్తును బలంగా కోరుకుంటారు. ఆ మాదక ద్రవ్యానికి బానిస అవుతారు. క్రమంగా విత్డ్రాయల్కు గురవుతారు. అంటే, మత్తు తీసుకోకపోతే, ఆ మనిషిలో అసహజమైన లక్షణాలు కనిపిస్తాయి. ఆ సమయానికి డ్రగ్స్ అందకపోతే తట్టుకోలేరు. మత్తు తీసుకుంటే తప్ప, మామూలు మనుషుల్లా ప్రవర్తించలేరు. ఆ విత్డ్రాయల్ లక్షణాలను నిలువరించేందుకు మళ్లీ డ్రగ్స్ తీసుకోవాల్సి రావడాన్నే‘ఇంపాక్సికేషన్’ అంటారు. ఈ దశకు చేరుకున్న వ్యక్తిలో మెదడు చురుగ్గా పనిచేయదు. కారణం, మాదక ద్రవ్యాల ప్రభావంతో మెదడులోని ‘హిపో కాంపస్’ మొద్దుబారిపోతుంది. మనల్ని నియంత్రించే ప్రధాన భాగమిది. ఏది మంచో, ఏది చెడో తెలియజెప్పే తీర్పరీ ఇదే. మనిషి మనిషిలా ప్రవర్తించేలా స్వీయ నియంత్రణ శక్తినీ ప్రసాదిస్తుంది. కానీ, ఇంపాక్సికేషన్లోకి వెళ్లిన వ్యక్తి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేడు. ఏది మంచో, ఏది చెడో ఆలోచించే శక్తి ఉండదు. ఏం చేయాలనిపిస్తే అది చేస్తాడు.
‘టాలరెన్స్’ దశ దాటితే..
మాదక ద్రవ్యాలు తీసుకునే వారు, టాలరెన్స్ దశకు చేరుకొంటే ప్రమాదపు అంచున ఉన్నట్లే. అంటే, రోజువారీగా తీసుకునే మత్తు పదార్థాల మోతాదు ఏమాత్రం సరిపోదు. దీంతో మరింత, ఇంకొంత పుచ్చుకోవడం మొదలు పెడతారు. డోస్ సరిపోకపోతే ఫిట్స్ వస్తాయి. కొంత మందికి పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాలేయమూ దెబ్బ తింటుంది. అలానే వదిలేస్తే ఆ వ్యసనపరుడి పరిస్థితి ప్రాణాంతకమూ కావచ్చు.
చికిత్సా పద్ధతులు
ప్రారంభ, మధ్యస్థ, తీవ్ర .. ఏ వ్యసనానికైనా ఈ మూడు దశలు ఉంటాయి. మత్తుకు బానిసలైన మూడు దశలవారినీ కూడా డీ-ఎడిక్షన్ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఈ చికిత్సను అందించేందుకు అనేక ‘రిహాబిలిటేషన్ సెంటర్స్’ ఉన్నాయి. తొలి రెండు దశల రోగులను ఎనిమిది నుంచి పది రోజుల్లో విత్డ్రాయల్ లక్షణాల నుంచి బయట పడేయవచ్చు. అంటే , మత్తు పదార్థాలు తీసుకోలేకపోతే కలిగే విపరిణామాల నుంచి దూరం చేయవచ్చు. తీవ్ర దశలోని రోగిని 10 నుంచి 15 రోజుల్లో ఆ వలయం నుంచి తప్పించవచ్చు. ఆ తరువాత మత్తు పదార్థాలు తీసుకున్నా కిక్కు రాకుండా, అసలు తీసుకోవాలనే కోరికే పుట్టకుండా ‘వాల్ప్రోయిక్ ఆసిడ్’,‘నల్ట్రేగ్జాన్’, ‘బ్యూప్రోపియాన్,‘టాపిరమేట్’.. వంటి మందులు ఇస్తారు. ఇలాంటి ఔషధాలను రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా కనీసం మూడు నెలల పాటు వాడాల్సి ఉంటుంది. వారానికి ఒక రోజు కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. డీ-ఎడిక్షన్ చికిత్స తర్వాత కూడా మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది అపోహ మాత్రమే. కాకపోతే, చికిత్స పూర్తయ్యాక కూడా కొంత కాలం వరకూ వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. దీనివల్ల, రోగి శారీరక, మానసిక పరిస్థితిలో ఏ చిన్న తేడా వచ్చినా తక్షణం వైద్యం అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవన శైలిని మార్చుకోవాలి. మత్తుకు అలవాటు పడిన మిత్రబృందానికి దూరంగా ఉండాలి.
.. ఇవన్నీ హింసా ప్రవృత్తికి దారితీయవచ్చు. మనిషిని ఓ మోస్తరు మృగంలా మార్చేయవచ్చు.
కన్నవారి బాధ్యత
అభంశుభం తెలియని పిల్లలు కూడా ఏదో ఒక రకమైన మత్తుకు అలవాటు పడుతున్నారంటే అందుకు పెద్దల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం. సామాజిక హోదా కోసం ఈ మధ్య చాలా మంది తమ పిల్లలను పబ్బులు, క్లబ్బులు, పార్టీలకు పంపుతున్నారు. ఆ మత్తులో వారు హద్దులేని వేగంతో వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలు బలిగొన్నా, అత్యాచార యత్నాలకు పాల్పడినా, ట్రాఫిక్ సిబ్బంది మీద దాడులకు తెగబడినా .. తమ పరపతితో వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరకంగా తమ పిల్లలు సంఘ విద్రోహశక్తులుగా మారేలా ప్రోత్సహిస్తున్నారు. ఇది సరికాదు. పిల్లలు వ్యసన పీడితులు అవుతున్నట్టు ఏ చిన్న అనుమానం వచ్చినా ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకట్ట వేయాలి. నిజానికి, కన్నవారిలో ఏ ఒక్కరు మత్తు పదార్థాలకు బానిసలైనా, ఆ ప్రభావం పిల్లల మీదా పడుతుంది. వాళ్లూ అదే దారిని ఎంచుకొంటారు. వేలకు వేల డబ్బు పిల్లలకు అందుబాటులో ఉండకుండా చూడగలిగితే మరీ మంచిది. కౌమారంలో పిల్లలకు ఇవ్వాల్సింది డబ్బు కాదు, వ్యక్తిత్వం. వాళ్లకు అలవాటు కావాల్సింది వ్యసనాలు కాదు, ఆరోగ్యకరమైన జీవన శైలి.
…మహేశ్వర్రావు బండారి
డాక్టర్ జె.కృష్ణ సాహితి
ఎండీ, సైకియాట్రి (ఫిప్స్)
ఫెరోనియా
సూపర్ స్పెషాలిటీ క్లినిక్
మణికొండ