సిటీబ్యూరో, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రోత్సాహంతో పారిశ్రామిక అభివృద్ధి విస్తరిస్తున్నది. తెలంగాణతో పాటు సైబరాబాద్ పరిధి అత్యంత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అదే తరహాలో జనావాస ప్రాంతాలు సైతం విస్తరించుకుంటున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఒకప్పటి గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు పట్టణాలుగా రూపాంతరం చెందాయి. ఉద్యోగస్తులు, నగర ప్రజలు ఈ ప్రాంతాల్లో నివసించడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా శివారులో జనాభా అత్యధిక సంఖ్యలో పెరిగిపోతున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం భద్రత అంశానికి అమిత ప్రాధాన్యతను కల్పిస్తున్నది.
దీన్ని మరింత పటిష్టంగా అమలుచేస్తూ.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సమర్థవంతమైన పోలీసింగ్ను నిర్వహిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. మంగళవారం నాటికి ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి 111 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. సైబరాబాద్ పరిధిలో ప్రభుత్వ నిర్ణయం మేరకు అందరికీ ఒకే తరహా ఫ్రెండ్లీ పోలీసింగ్ను అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజా భద్రతకు భంగం కలిగించే నేరస్తులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీంతో ప్రభుత్వం శాంతి భద్రతలతో పాటు అత్యాధునిక సైబర్ సెక్యూరిటీని అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమలకు ఓ పటిష్టమైన సైబర్ సెక్యూరిటీని కల్పించేందుకు మెకానిజంను రూపొందిస్తున్నారు. దీంతో దేశంలో ఎక్కడాలేని విధంగా ఐటీ పరిశ్రమలకు సైబర్ భద్రత లభించనున్నది. ఈ సెక్యూరిటీని ఎవరు కూడా టచ్ చేయలేరు.. ప్రయత్నించినా వారిని పట్టుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ సైబర్ భద్రతతో మన రాష్ట్రం, సైబరాబాద్ పరిధిలోని ఐటీ పరిశ్రమలకు ఎలాంటి ఢోకా ఉండదు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా ఓ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. దీని కోసం నిపుణులను నియమించుకున్నాం. సైబర్ నేరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా వాటి మూలాలను పెకిలిస్తామని సీపీ తెలిపారు.
ఆర్థిక నేరాల నియంత్రణకు ఓ ప్రత్యేక ప్లాన్ను తయారు చేసుకున్నాం. ప్రజలను నిండా ముంచి కోట్లాది రూపాయలు సంపాదించే ఆర్థిక నేరగాళ్లను వదిలిపెట్టం. కొట్టేసిన డబ్బును ఎక్కడికి తరలించినా వాటిని తిరిగి తీసుకువస్తాం. దీనికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం పొందేలా సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తున్నాం. నిపుణులను నియమించుకుంటున్నాం. మోసం చేసిన డబ్బును రికవరీ చేయలేమని విర్రవీగే నేరగాళ్లకు కళ్లెం వేస్తాం.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రూల్ ఆఫ్ లాను కచ్చితంగా అమలు చేస్తాం. బడాబాబులకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమనే వ్యత్యాసం ఉండదు. తప్పు ఎవరు చేసినా.. చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సిందే. ప్రజలు న్యాయం కోసం నిర్భయంగా పోలీస్ అధికారులను సంప్రదించవచ్చు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితుల్లో పోలీసులంటే ఓ నమ్మకాన్ని కల్పించింది. ఎవరు అనుమానాలు, అపోహలకు గురి కావద్దు. అందరికీ ఒకే తరహా పోలీసింగ్ అందుతుంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పోలీస్ సేవలు నాలుగున్నర నుంచి ఐదున్నర నిమిషాల్లో అందుతున్నాయి. ఈ పోలీస్ సేవలను రోజు వారీగా విశ్లేషించుకుంటున్నాం. వచ్చిన ఫోన్ కాల్స్కు నిమిషాల వ్యవధిలోనే సేవలు అందజేస్తున్నాం. ఈ సేవలకు ప్రతి దానికి లెక్క పక్కగా ఉంది.
మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాం. వారి ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నాం. జాప్యం లేకుండా చూస్తున్నాం. వేగంగా పోలీస్ సేవలను అందించి వారిలో భరోసాను నింపుతున్నాం. షీ టీమ్స్ నిరంతరం పని చేస్తున్నాయి. వారి కేసుల్లో దర్యాప్తు నుంచి చార్జీషీటు దాఖలు వరకు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం.
కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది అందరూ సమర్థవంతంగా పని చేస్తున్నారు. నేర నియంత్రణతో పాటు శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్ సేఫ్ సిటీకి ఆదర్శంగా నిలుస్తున్నది. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ వారి విధులను సక్రమంగా నిర్వహిస్తుండటంతో 20 వర్టికల్స్ సేవల్లో పురోగతి కనిపిస్తుంది. ఈ వర్టికల్స్లో పనిచేసే సిబ్బంది పని తీరు, ప్రతిభకు గుర్తింపుగా రివార్డులను అందిస్తున్నాం. చోరీలు, దొంగతనాలు, స్నాచింగ్లు పూర్తిగా తగ్గాయి. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై కఠినంగా ఉంటున్నాం. ప్రతి మార్గాన్ని దిగ్భందం చేస్తున్నాం. పోలీస్ సంక్షేమానికి కూడా పెద్ద పీట వేస్తున్నాం.