Crude Oil price : పశ్చిమాసియా (West Asia) లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అమెరికా (America), ఇరాన్ (Iran) మధ్య నౌకలపై పరస్పర దాడులు జరగడంతో ముడి చమురు ధరలు (Crude Oil Price) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో సరఫరాకు దీర్ఘకాలిక అంతరాయం కలుగుతుందన్న భయాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి.
ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీనికి ప్రతిగా, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ కూడా అమెరికా నౌకలతోపాటు, అనధికారిక మార్గాల్లో ప్రయాణిస్తున్న ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఈ పరిణామాలను విశ్లేషకులు ‘ప్రధాన ఘర్షణ’ గా అభివర్ణిస్తున్నారు. ఈ ఘర్షణల ప్రభావం హర్మూజ్ జలసంధిపై తీవ్రంగా పడింది. సాధారణంగా ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుంది.
ప్రస్తుతం ఇక్కడ నౌకల రాకపోకలు భారీగా పడిపోయాయి. గతంలో రోజుకు 100 కుపైగా నౌకలు ప్రయాణించగా.. ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 10 కి పరిమితమైంది. త్వరలో ఈ ప్రాంతంలో కొత్తగా ‘రిస్ట్రిక్టెడ్ జోన్’ ప్రకటించేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.54 శాతం పెరిగి 96.80 డాలర్లకు చేరుకుంది.
అమెరికా బెంచ్మార్క్ డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.72 శాతం పెరిగి 92.14 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత వారంలోనే ఈ ధరలు 8-10 శాతం వరకు పెరిగాయి. మరోవైపు సెప్టెంబర్ 6న సమావేశమైన ఒపెక్ ప్లస్ దేశాలు అక్టోబర్ ఉత్పత్తి విధానంలో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించాయి. హర్మూజ్ జలసంధిలో సరఫరా అంతరాయాలు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
2026 చివరి వరకు ఎగుమతులు పరిమితంగానే ఉంటాయని, పూర్తిస్థాయి పునరుద్ధరణ 2027లోనే సాధ్యమవుతుందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ద్రవ్యోల్బణం, ఆర్థికవృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తదుపరి దాడులు, దౌత్యపరమైన చర్చలపైనే మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది.