మహిళల భద్రత..తమదే బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. హాకా భవన్లోని షీ టీమ్స్, భరోసా కేంద్రాలను గురువారం సందర్శించారు. వీటిల్లో మహిళలకు అందుతున్న సేవలు, అమలవుతున్న విధానాలను షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్రను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. రానున్న రోజుల్లో షీ టీమ్స్లో మరికొన్ని సంస్కరణలు తీసుకొస్తామని వెల్లడించారు.
మహిళల భద్రత, పౌరుల కోసం మహత్తరమైన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. మహిళలకు మేమున్నామంటూ.. భరోసా కల్పిస్తూ ..షీ టీమ్స్ పనిచేస్తున్నాయని చెప్పారు. ఈవ్టీజింగ్, పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీపీ వెంట అదనపు సీపీ శ్రీనివాస్, జాయింట్ సీపీ గజరావు భూపాల్ తదితరులు ఉన్నారు.