హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కొవిడ్ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో క్యాంపులు నిర్వహించాలని జిల్లాల అధికారులకు సూచిస్తున్నది. ఇప్పటికే జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తూ, మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండో డోసు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ప్రజల వద్ద కే వ్యాక్సిన్ను తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.28 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.