మియాపూర్ , డిసెంబరు 6 : ‘హలో నేను ఎస్ఎఫ్ఏను మాట్లాడుతున్నా.. మీ కరోనా టీకా రెండో డోసు గడువు వచ్చింది.. రేపు మీ కాలనీలోనే ఏర్పాటు చేస్తున్న మొబైల్ టీకా కేంద్రం వద్ద మీరు టీకా తీసుకోవాలి. రెండు డోసుల టీకాతో కరోనా నుంచి రక్షణ పొందొచ్చు..’ అంటూ శేరిలింగంపల్లి జోన్ పరిధిలో రెండో డోసు టీకా తీసుకోవాల్సిన ప్రజలకు జీహెచ్ఎంసీ సిబ్బంది నుంచి ఫోన్లు వస్తున్నాయి. ప్రధానంగా ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెకండ్ డ్రైవ్.. సెకండ్ డోస్ పేరిట ప్రత్యేక మొబైల్ టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ మాసంలో జోన్లోని పలు కేంద్రాల్లో మొదటి డోస్ తీసుకుని.. రెండో డోసు టీకాను గడువు తేదీన తీసుకోవాల్సిన వారికి జడ్సీ ప్రియాంక ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గుర్తు చేస్తున్నారు. జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లకు చెందిన ఎస్ఎఫ్ఏలు, ఆర్పీలు ప్రతిరోజూ జోన్ వ్యాప్తంగా సుమారు 500 మందికి ఇలా ఫోన్లు చేస్తున్నారు.
జోన్ వ్యాప్తంగా ఈనెల 8 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ డోస్ డ్రైవ్ను చేపడుతున్నాం. వంద శాతం టీకాయే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సెకండ్ డోస్ తీసుకోవాల్సిన ప్రజలకు మా సిబ్బందితో ముందురోజే ఫోన్ చేయిస్తున్నాం. ప్రతిరోజూ దాదాపు 500 మందికి రెండో టీకా కోసం ఫోన్చేసి అలర్ట్ చేస్తున్నారు. మూడో దశ కరోనా నేపథ్యంలో ప్రజలు మొబైల్ టీకా సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – అల ప్రియాంక, జోనల్ కమిషనర్,శేరిలింగంపల్లి