హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ ఆరోగ్య వ్యవస్థలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి అనేక పాఠాలు నేర్పిందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన వైద్యుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. హెచ్ఐసీసీలో యశోద హాస్పిటల్స్ ఏర్పాటుచేసిన రెండురోజుల ‘బ్రోంకస్-2021’ రెండో అంతర్జాతీయ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ కాన్ఫరెన్స్ను శనివారం ఉపరాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు. ఈ సదస్సు ద్వారా పల్మనాలజీలో బేసిక్ నుంచి అత్యాధునిక వైద్య పద్ధతుల వరకు అందిపుచ్చుకొనే అవకాశం లభిస్తుందని చెప్పారు. అతిపెద్ద పల్మనాలజిస్టుల సదస్సు నిర్వహించడంపై యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ గోరుకంటి హర్షం వ్యక్తంచేశారు. ఈ సదస్సు ప్రపంచ పల్మనాలజీ అసోసియేషన్తోపాటు యురోపియన్ ఫర్ బ్రాంకాలజీ గుర్తింపు పొందడం అరుదైన ఘనతని పేర్కొన్నారు.